వరుస రిలీజ్లు ఉన్న టైమ్లో ఈ రీరిలీజ్లు ఏంటి? ఈ మాట మీరు ఎప్పుడైనా అన్నారా? ఇప్పటివరకు మీకు అలా అనిపించి ఉంటే ఓకే.. లేదంటే అనే పరిస్థితి వచ్చేలా ఉంది. ఎందుకంటే పాత సినిమాలు, కల్ట్ సినిమాలు అంటూ ఎప్పటివో సినిమాలను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అలా రానున్న రెండు వారాల్లో 10 సినిమాలకుపైగా రీరిలీజ్ కాబోతున్నాయి. దీంతో రీరిలీజ్ డోస్ ఓవర్ అవుతోందా అనే టాక్, చర్చ నడుస్తోంది.
ఈ నెల రామ్ – భాగ్య శ్రీ భోర్సే సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కాకుండా ఇంకా ఏ పేరున్న సినిమా లేదు. దీంతో రీరిలీజ్ టీమ్లు రెడీ అయిపోయాయి. కొన్ని ముందు నుండి అనుకున్న సినిమాలు కాగా, కొన్ని ఇప్పటికప్పుడు రెడీ అయిన సినిమాలు మరికొన్ని. ఎలా అయితేనేం ఓవర్ డోస్ అనిపించుకునేలా వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. రీరిలీజుల్లో మొదటిది నాగార్జున – రామ్గోపాల్ వర్మ ‘శివ’. నవంబర్ 14న ఈ సినిమాను కొత్త సాంకేతిక హంగులతో తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం టీమ్ చాలా నెలలుగా కష్టపడి సరికొత్త 4కె ప్రింట్ తీసుకొచ్చింది.

సిద్దార్థ్ – ప్రభుదేవా – త్రిష సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 21న మెగాస్టార్ చిరంజీవి ‘కొదమసింహం’ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. 1990లో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్లో తొలి కౌబాయ్ సినిమా అని చెప్పొచ్చు. అక్కడికి ఒక రోజు తర్వాత అంటే నవంబర్ 22న కార్తి – తమన్నా ‘ఆవారా’ వస్తోంది. అక్కడికి ఓ వారానికి నవంబర్ 28న సూర్య – సమంత ‘సికందర్’ రానుంది. ఈ సినిమా తొలిసారే డిజాస్టర్. అయితే మార్పులు చేసి సరికొత్తగా రిలీజ్ చేస్తున్నామని టీమ్ చెబుతోంది. నవంబర్ 29 మహేష్ బాబు – పూరి జగన్నాథ్ ‘బిజినెస్ మెన్’ వస్తోంది. గతంలో వచ్చినా ఈ సారి ఎక్కువ షోలు ప్లాన్ చేస్తున్నారట. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.
