మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనల గురించి మనం రోజూ వింటూనే ఉన్నాం. ఈ పని చేయడానికి వాళ్లు, వీళ్లు.. ఆ వర్గం, ఈ వర్గం అనే తేడా ఏమీ లేదు అని కొంతమంది నిరూపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ భారత సంతతికి చెందిన ప్రముఖ నటిని ఒక పూజారి లైంగికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఈ విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారిపోయింది.
మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్పై ఒక పూజారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది దూరంలోని సెపాంగ్లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో తనపై వేధింపులు జరిగాయని లిషల్లిని పేర్కొన్నారు. ఆ ఆలయంలోని పూజారి తనపై పవిత్ర జలం చల్లే నెపంతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించాడని ఆమె తెలిపారు. ప్రస్తుతం మలేషియా పోలీసులు ఆ భారతీయ పూజారి కోసం వెతుకుతున్నారు.
తాను పడ్డ ఇబ్బందిని తెలియజేస్తూ లిషల్లిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు రాసుకొచ్చారు. దాన ప్రకారం చూస్తే.. జూన్ 21న లిషల్లిని ఒంటరిగా గుడికి వెళ్లింది. ఆ సమయంలో ఆస్థాన పూజారి లేకపోవడంతో.. అతని స్థానంలో మరో పూజారి తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. లిషల్లిని చూసి కాసేపు ఆగమని, ప్రార్థనలు ముగిసిన తర్వాత కలుస్తానన్నాడు. అక్కడికి సుమారు గంట తర్వాత ఆ పూజారి ఆమెను ప్రైవేటు ఆఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆశీర్వదిస్తున్నట్లు చెప్పి ఓ ద్రవాన్ని ఆమెపై చల్లాడు. ఆ తర్వాత ఒంటిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఆ సమయంలో తన బ్రెయిన్ పనిచేయలేదని, నోటి నుంచి మాటలు రాలేదని, నిశ్చేష్టురాలైపోయాను అని లిషల్లిని వాపోయింది. అలా గుడిలో పూజారి వేధించడాన్ని తట్టుకోలేకపోయానని, అందుకే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నట్లు ఆ పోస్టులో పేర్కొంది. అయితే ఈ విషయమై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని లిషల్లిని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం పోలీసులు ఆ పూజారి కోసం వెతుకుతున్నారని సమాచారం.