Tollywood: టాలీవుడ్ థియేటర్ వార్: ఈ రోజు మీటింగ్లో ఏం తేలుస్తారో మరి?
- May 15, 2026 / 03:30 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్కి సరైన విజయం వచ్చి చాలా రోజులైంది.. భారీ వసూళ్లు వచ్చి కూడా చాలా రోజులైంది. ఈ విషయంలో ఎవరి చర్చ వారు చేసుకుంటున్నారేమో కానీ.. ఇవి కాని మరో డిస్కషన్ ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద ఎత్తున డిస్కషన్కి కారణమయ్యేలా చేస్తోంది. అదే ‘సింగిల్’ స్క్రీన్ల షేర్ విధానం. మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్లుగా సినిమా వసూళ్లలో షేరింగ్ ఇచ్చేంతవరకు తెలంగాణలో సినిమాలను ప్రదర్శించేది లేదు అని ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి తేల్చేశారు. దీనిపై కొంతమంది నిర్మాతలు బయటకు వచ్చి మాట్లాడారు కూడా.
Tollywood
అయితే, ఈ రోజు ఈ వ్యవహారంలో కీలక సమావేశం జరగనుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలకీ మధ్య సినిమాల ప్రదర్శనల విషయంలో నెలకొన్న వివాదం చలన చిత్ర వాణిజ్య మండలికి చేరిన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్బాబు సమావేశానికి సిద్ధమయ్యారు. ఛాంబర్ ఆధ్వర్యంలో థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలు ఈ రోజు సమావేశమై చర్చించనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు అద్దె విధానంలో ప్రదర్శించడంపై కొందరు నిర్మాతల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఒక సినిమాను లక్ష్యంగా చేసుకుని, ఆ సినిమా విడుదలకు ముందు కావాలనే ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది నిర్మాతలు కలసి ఆరోపించారు. నిర్మాతలు, ప్రదర్శనకారులు ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకునేంతవరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నామనే ఆరోపణల్లో నిజం లేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు. 2008 నుండి తాము పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని అడుగుతున్నామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
18 ఏళ్లుగా ఉన్న ఈ విషయంలో ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతోనే షోలు వేయడానికి నిరాకరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు థియేటర్ యజమానులు చెబుతున్నారు. థియేటర్ల మనుగడ కోసమే ఇదంతా చేస్తున్నామని కూడా చెప్పారు. మరి ఈ రోజు మీటింగ్లో ఛాంబర్ ఏం తేలుస్తుందో చూడాలి.










