క్రికెట్ – బెట్టింగ్.. ఇది ఇప్పటి విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది. ఆఫ్లైన్ బెట్టింగ్ విషయంలో నిఘా బలంగా మారడంతో ఆన్లైన్, ఫోన్ కాల్స్ బెట్టింగ్ వైపునకు బెట్టింగ్ రాయుళ్లు మళ్లారు. దానికి కారణం బెట్టింగ్ బాబులు కూడా దానిని వేదిక చేసుకున్నారు అని. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. తొలుత ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ ఎక్కువైంది. ఆ తర్వాత చాలా ఆటలకు సాగింది. ఇప్పుడు జడలు విప్పుకుని మహమ్మారిలా మారింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంలోనే కేసులు నమోదు అయ్యాయి.
విచారణలు కూడా మొదలవ్వాల్సి ఉంది. తెలుగు టీవీ నటులు, సోషల్ మీడియా సెలబ్రిటీల్లో మొత్తం 11 మంది మీద కేసు నమోదు అయింది. ఇంకా మరికొందరు ఉన్నారు అని చెబుతున్నారు. ఈ క్రమంలో మంచు లక్ష్మి (Manchu Lakshmi) లాంటి వాళ్ల వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. ఆమెనే కాదు చాలా యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాయి. బెట్టింగ్లు వేయడం, ప్రోత్సహించడం, ప్రచారం చేయడం ఎంత తప్పో.. ఈ బెట్టింగ్ని నిర్వహించడం అంత కంటే పెద్ద తప్పు.
ఈ లెక్కన ప్రచారం చేసినోళ్ల మీద కేసులు పెట్టి విచారణకు పిలుస్తున్నప్పుడు.. ఆ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారి మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్లో, తెలుగు సినిమా, టీవీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నెటిజన్లలో చాలామంది ఇదే విషయం అని అంటున్నారు. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నటులు, ఛోటా సెలబ్రిటీలు (Celebrities) ఇటీవల ప్రచారం షురూ చేయలేదు. చాలా ఏళ్ల నుండి ఈ పని చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఎవరూ వారిని ప్రశ్నించలేదు. దీంతో ఇలా ప్రచారం చేయడం తప్పు కాదేమో అనే భ్రమ ప్రజల్లో ఉండిపోయింది.
ఇప్పుడు హఠాత్తుగా చర్యలు మొదలయ్యే సరికి ‘ఓహ్ ఇది తప్పు పనా?’ అని అనుకుంటున్నారు. వీరి మీద కేసులు పెట్టడంలో చొరవ చూపించిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసినవారి మీద కేసుల నమోదుకు ముందుకు రావాలని సగటు ప్రజలు ఆశిస్తున్నారు. ఆఖరిగా ఓ మాట.. మొన్నీమధ్య వరకు ఐపీఎల్ లాంటి పెద్ద వేదికకు బ్రాండ్ ప్రమోటర్గా ఉన్న యాప్ కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాపే అనే విషయం గుర్తుంచుకోవాలి.