‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ చూశాక.. సినిమాలో పాయింట్ బాగుంది అని కొందరు అంటుంటే.. మరికొందరు సినిమాలో చూపించిన ఊరు బాగుంది అనే మాట అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో చూపించిన ప్రాంతాలు తెలుగు సినిమాలో చాలా తక్కువగా చూపించి ఉంటారు. ఆ మాటకొస్తే ఈ మధ్య కాలంలో ఎవరూ చూపించలేదు. ఎందుకంటే ఆ ప్రాంతం సీలేరు. ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిద్దులోని ఊరు అది. దీని గురించి ఆ సినిమా దర్శకుడు శివ నిర్వాణ చెప్పుకొచ్చారు.
‘రంగస్థలం’ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ మారేడుమిల్లి వరకు వెళ్లారు. ‘ఇరుముడి’ సినిమా కోసం మేం మారేడుమిల్లి దాటి ఒడిశా సరిహద్దులకు వెళ్లాం. అక్కడి సీలేరు డ్యామ్కి దగ్గరగా ఉన్న ఓ గ్రామాన్ని ఎంచుకున్నాం సినిమా షూట్ చేశాం. ఆ ప్రాంతంలో చుట్టూ అడవులు, కొండలు, డ్యామ్లే ఉన్నాయి. ఆ ప్రాంతంలోని జనం చిత్రీకరణకి మంచి సహకారం అందించారు. 250 మందితో అక్కడికి వెళ్లి షూటింగ్ చేసుకొని వచ్చాం. అక్కడి చిన్న చిన్న ఇళ్లల్లోనే ఉంటూ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం అని చెప్పారు.
దీంతో టాలీవుడ్లో చాలా తక్కువగా కనిపించే ప్రదేశాన్ని ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాలో చూడబోతున్నాం అని చెప్పొచ్చు. ఈ సినిమా రీమేక్ అంటూ కొన్ని రోజుల క్రితం అంటే సినిమా టీజర్, ట్రైలర్ రాకముందు వచ్చిన రూమర్ల గురించి శివ నిర్వాణ మాట్లాడుతూ అరుదైన నేపథ్యంలో సాగే కథ కావడంతోనే ఈ ప్రచారం జరిగిందని చెప్పారు. ఇరుముడితోపాటు, పాపని ఎత్తుకుని కనిపించే రవితేజ లుక్ విడుదల చేయడంతోనే ఇది ‘మాలికాపురం’ సినిమాకు రీమేక్ అనుకున్నారంతా అని చెప్పారు.
అయ్యప్ప స్వామి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ‘మాలికాపురం’ తప్ప సినిమాలు రాలేదు కదా. అలాగే హీరో పాత్ర డాక్టర్, ఇంజినీర్, పోలీసు అధికారి అయి ఉంటే ఇలాంటి కామెంట్లు వచ్చేవి కావు అని అన్నారాయన. ఈ కథ ఎందుకు రాసుకున్నారు అని అడిగితే.. మా ఇంటికి 500 మీటర్ల దూరంలో అయ్యప్పస్వామి గుడి ఉంది. దాంతో కార్తీక మాసమంతా అయ్యప్ప భజనలు, గీతాలు బాగా వినేవాళ్లం. అలా ఓ సినిమా కథ అనుకున్నప్పుడు మా కథలోని తాగుబోతు నాన్న పాత్ర అయ్యప్ప మాల వేస్తే.. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆ మాల వేసుకున్నాక వెంటాడితే ఎలా ఉంటుంది అనే అంశం తట్టింది. దానికి తండ్రీకూతుళ్ల బంధం జోడించి ఈ కథ రాసుకున్నా అని శివ చెప్పారు.