ఓ సినిమా కోసం ఎంతో వెయిట్ చేసిన ప్రేక్షకులు.. ఆ సినిమా టీజర్ చూసి తీవ్ర నిరాశచెందారు. ఈ సినిమా విడుదల కాకపోయినా ఫర్వాలేదు అనుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన మరో టీజర్ సినిమా మీద నమ్మకాన్ని పెంచింది. ఇదంతా చదివి ‘ఆదిపురుష్’ సినిమా గురించి అనుకునేరు. ఇలాంటి సినిమా ఇంకొకటి కూడా ఉంది. అదే ‘విశ్వంభర’.
చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన సినిమా ఇది. సినిమా నేపథ్యం, వశిష్టకు అంతకుముందు వచ్చిన విజయం చూసి మెగా ఫ్యాన్స్ ఈ సినిమా గురించి తెగ ముచ్చటపడ్డారు. అయితే టీజర్ వారి ఆశల మీద నీళ్లు చల్లింది. వివిధ పరిణామాల తర్వాత సినిమాను సమ్మర్లో రిలీజ్ చేస్తామని చెప్పి.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ పనిలో పడ్డారు చిరంజీవి.
ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆ సినిమా రిలీజ్ గురించి చిరంజీవి మాట్లాడారు కాబట్టి. ఇటీవల మీడియా మిత్రులను చిరంజీవి ఇంటికి పిలిచి చాలాసేపు మాట్లాడారు. ఈ క్రమంలోనే ‘విశ్వంభర’ సినిమా టాపిక్ చర్చకు వచ్చింది. జూన్ లేదా జులైలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నామని.. చాలా వరకు జులై రెండో వారంలోనే సినిమా ఉండొచ్చు అని క్లారిటీ ఇచ్చేశారు చిరంజీవి.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భారీగానే ఖర్చయింది. అయితే ఆ స్థాయిలో ప్రీ బిజినెస్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో కూడా సినిమా విడుదలను వాయిదా వేశారు అని సమాచారం. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సాధించిన విజయంతో చిరంజీవి సినిమాకు మార్కెట్ భారీగా పెరిగింది. ఇదంతా ‘విశ్వంభర’ సినిమాకు పాజిటివ్గా మారింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. ఆ టైమ్కి వశిష్ట సినిమా రెడీ చేస్తారా అని.
ఈ సినిమా విషయంలో వస్తున్న పెద్ద విమర్శ విజువల్ ఎఫెక్ట్స్. అవి నాసిరకంగా ఉండటంతోనే గ్లింప్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటిని సరిద్దితూనే ఉన్నారు. అందుకే సమ్మర్ అన్న రిలీజ్ కాస్తా రెయినీ సీజన్కి వెళ్లింది అంటున్నారు.