ప్రారంభం ఎలా ఉన్నా.. ముగింపు బాగుంటే.. వచ్చే ఏడాదికి మంచి బూస్ట్ ఉంటుంది అని చెబుతుంటారు టాలీవుడ్లో. ఈ ఏడాది ముగింపు బాధ్యతలు ఎక్కువ సినిమాలే తీసుకోనున్నాయి. తెలుగు, ఇతర భాషల సినిమాలు కలిపి ఎనిమిది వరకు డిసెంబరు ఆఖరి వారంలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో అన్నీ వస్తాయా అంటే ఇంకా రెండు వారాలు ఉంది కాబట్టి చెప్పలేం. ఇప్పటివరకు అయితే ముగింపు కోసం సాలిడ్ ప్లానింగ్ కనిపిస్తోంది.
శ్రీకాంత్ తనయుడు రోషన్, అనస్వర రాజన్ సినిమా‘ఛాంపియన్’.. ఆది సాయికుమార్ సినిమా ‘శంబాల’ చాలా రోజుల క్రితమే క్రిస్మస్ డేట్ మీద కర్చీఫ్ వేసేశాయి. ఈ మేరకు ఆ సినిమాల ప్రచారం కూడా జోరుగా చేస్తున్నారు. ఇక ‘అఖండ 2: తాండవం’ వాయిదా వల్ల ‘ఈషా’ సినిమాను కూడా 25కే విడుదల చేస్తున్నారు. ఇక 12నే రావాల్సిన కార్తి ‘అన్నగారు వస్తారు’ సినిమాను కూడా క్రిస్మస్కే రిలీజ్ చేస్తామని చెప్పారు. అప్పుడు ఏదో కోర్టు కేసు వల్ల ఆగిపోయింది. ఇక శివాజీ ప్రధాన పాత్ర పోషించిన ‘దండోరా’ సినిమా కూడా అప్పుడే వస్తోంది.
ఇవి కాకుండా ఇతర భాషల సినిమాలు కూడా డిసెంబరు 25న టార్గెట్ చేశాయి. కిచ్చా సుదీప్ కొత్త సినిమా ‘మార్క్’ను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. మోహన్ లాల్ ప్రయోగాత్మక చిత్రం ‘వృషభ’ను ఇయర్ ఎండింగ్ టార్గెట్గానే తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా ‘పతంగ్’, ‘వానర’ లాంటి చిన్న సినిమాల ఆలోచన కూడా ఇయర్ ఎండింగ్ మీదే ఉంది. మామూలుగా అయితే ఇన్ని సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ల సమస్య ఉంటుంది.
అయితే ఈ సినిమాల్లో పెద్ద హీరో సినిమా ఏదీ లేకపోవడం.. కాస్త పేరున్న సినిమాల వెనుక పెద్ద నిర్మాణ సంస్థలు, పంపిణీ సంస్థలు ఉండటం మూలాన రిలీజ్ సమస్యలు ఏవీ ఉండవు అంటున్నారు. అయితే ఆ రోజు వచ్చేసరికి ఈ సినిమాలన్నీ బరిలో ఉంటాయో లేదో చూడాలి.