‘మేం వెనక్కి వెళ్లడం లేదు.. కచ్చితంగా చెప్పిన తేదీకే వస్తాం’ అని ఈ మధ్య ‘ఓజీ’ సినిమా టీమ్ ఓ ట్వీట్ చేసింది. మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు అదే తేదీకి షెడ్యూల్ అయిన ‘అఖండ 2: తాండవం’ సినిమా టీమ్ ఇలాంటి ట్వీటే వేయనుందా? లేక పుకార్లను నిజం చేస్తూ కొత్త డేట్ చెబుతూ పోస్ట్ వేయనుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో, తెలుగు సినిమా వర్గాల్లో ఈ చర్చే జరుగుతోంది. దీనికి కారణం అనుకున్న డేట్కి సినిమా రావడం కష్టం అనే పుకార్లు వినిపిస్తున్నాయి.
సెప్టెంబరు 25న ‘అఖండ 2: తాండవం’, ‘ఓజీ’ సినిమాలు ఇప్పటికే షెడ్యూల్ అయ్యాయి. రెండు టీమ్లు సినిమాను పూర్తి చేసేలా ఏర్పాటలు చేసుకుంటున్నాయి. ‘ఓజీ’ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు అని టీమ్ అనౌన్స్ చేసింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు టీమ్ రెండు బృందాలుగా విడిపోయి ఆ పనులు చేస్తోందని సమాచారం. కాబట్టి అనుకున్న తేదీ పక్కా అంటున్నారు.
అయితే, ‘అఖండ 2: తాండవం’ సినిమా టీమ్ నుండి అయితే షూటింగ్ అయిపోయింది అనే విషయం బయటకు రాలేదు. కనీసం షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే మాట కూడా చెప్పడం లేదు. దానికితోడు వివిధ కారణాల వల్ల ఈ మధ్య సినిమా షెడ్యూల్ ఒకటి అర్ధాంతరంగా ఆపేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్స్, ప్లాన్స్ మారి సినిమా అనుకున్న సమయానికే అవ్వకపోవచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త తేదీ కోసం చూస్తున్నారని వార్తలొస్తున్నాయి,
ఇక కొత్త చర్చల ప్రకారం సినిమాను డిసెంబరుకి తీసుకెళ్తున్నారట. అంటే ‘అఖండ’ వచ్చిన నెలలోనే ‘అఖండ 2: తాండవం’ వస్తుందని చెప్పాచ్చు. ప్రస్తుత అంచనాల ప్రకారం అయితే డిసెంబరు మూడో వారంలో విడుదల తేదీ ఉండేలా చూసుకుంటున్నారని సమాచారం. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఇది కాదంటే పైన చెప్పినట్లు సినిమా టీమ్ నుండి నో ‘పోస్ట్’పోన్ వస్తుంది.