Aneesh Chaganty: టామ్ క్రూజ్ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?
- May 15, 2026 / 03:38 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమాలకు బాలకృష్ణ ఎలాగో.. హాలీవుడ్ సినిమాలకు టామ్ క్రూజ్ అలాగా. మన బాలయ్యలా టామ్ క్రూజ్ అంత ఊరమాస్ అన్నమాట. వయసుతో సంబంధం లేకుండా సినిమాల్లో స్టంట్లు చేస్తూ, మాస్ ఎలివేషన్ సీన్లు చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతను ఓ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. మామూలుగా అయితే అది మనకు పెద్ద విషయం కాదు. కానీ ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాకు దర్శకుడు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి. అవును మీరు చదివింది కరెక్టే.
Aneesh Chaganty
టామ్ క్రూజ్ త్వరలో ‘డిగ్గర్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘డూపెల్గాంగర్’ అనే స్పై థ్రిల్లర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకే తెలుగు మూలాలున్న యువ దర్శకుడు అనీష్ చాగంటి డైరక్టర్ అని చెబుతున్నారు. 2018లో ‘సెర్చింగ్’ అనే సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనీష్.. డాన్ ఫ్రే కలసి ‘డూపెల్గాంగర్’ అనే స్క్రిప్ట్ రాశారట. ఆ కథనే పారామౌంట్ కొనుగోలు చేసింది.

స్పై థ్రిల్లర్ జోనర్లో రూపొందనున్న ఆ సినిమాకు అనీశ్నే డైరెక్ట్ చేయమని అడిగారట. ప్రాథమిక చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదరింది అని చెబుతున్నారు. అనీశ్ చాలా టాలెంటెడ్. గో ప్రో కెమెరాలు, ఐ ఫోన్లతో 2018లో ‘సెర్చింగ్’ అనే సినిమా తీశారు. దానికి 75 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇప్పటి డాలర్ రేటు ప్రకారం రూ.700 కోట్లు. ఆ రోజుల్లో అయితే రూ.450 కోట్లు.
ఇక ఆయన గురించి చూస్తే.. అనీష్ చాగంటి తెలుగబ్బాయే అయినప్పటికీ పుట్టిన వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకు బంధువులు కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. అందులో ‘సీడ్స్’ అనే లఘుచిత్రాన్ని గూగుల్ గ్లాస్ వాడి తెరకెక్కించడం గమనార్హం. ఆ తర్వాత ‘రన్’ అనే సినిమాను తెరకెక్కించారు. ‘మిస్సింగ్’ సినిమాకు రచయిత, నిర్మాత ఆయనే.














