స్టార్ హీరోలతో టైప్ అప్ అయ్యి.. సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల్ని మనం ఇన్నాళ్లూ చూశాం. అయితే అదే స్టార్ హీరోలతో టైఅప్ అయ్యి సినిమా థియేటర్లను నిర్మిస్తున్నారు ఏషియన్ సునీల్ నారంగ్ (Suniel Narang). ఏఎంబీ సినిమాస్ పేరుతో ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబుతో (Mahesh Babu) కలసి ఓ మల్టీప్లెక్స్ నిర్మించి ఈ ట్రెండ్ను స్టార్ట్ చేశారాయన. ఆ తర్వాత అల్లు అర్జున్తో (Allu Arjun) కలసి ఏఏఏ సినిమాస్ పేరుతో ఇంకో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరికొన్ని ఇదే దారిలో ఉన్నాయి. వీటి గురించి రీసెంట్గా సునీల్ నారంగ్ కొన్ని క్లారిటీలు ఇచ్చారు.
ముందుగా చెప్పాల్సింది ఐమ్యాక్స్ గురించి. హైదరాబాద్లో ఒకప్పుడు ప్రసాద్స్లో ఐమ్యాక్స్ ఉండేది. ఆ తర్వాత తొలగించారు. హకీంపేటలో ఏషియన్ వాళ్లు ఐమ్యాక్స్ నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి అవును అనే సమాధానం ఇచ్చారు సునీల్ నారంగ్. అయితే రెండేళ్ల తర్వాతనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇందులో ఇంకా ఏ హీరో కూడా భాగమవ్వలేదు అని తేల్చేశారు.
ఇక రవితేజతో కలసి వనస్థలిపుం వద్ద నిర్మిస్తున్న ఏఆర్టీ సినిమాస్ చివరి దశకు వచ్చిందని చెప్పేశారు. జులై మొదటి వారంలో దీని ఓపెనింగ్ ఉండొచ్చని చెప్పారు. లైసెన్స్ పనులు, ఇంటీరియర్ జరుగుతోందని చెప్పారు నారంగ్. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నిర్మిస్తున్న ఏఎంబీ – విక్టరీ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. అది భారీ స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక విశాఖపట్నంలో అల్లు అర్జున్తో కలసి నిర్మిస్తున్న మరో థియేటర్ కూడా సిద్ధమవుతోందని తెలిపారు.
గతంలో రామ్చరణ్తో (Ram Charan) కలసి ఓ థియేటర్ అనుకున్నారు కదా అని అడిగితే.. ఆ విషయంలో నో కామెంట్ అని చెప్పేసి ముగించారు. దీంతో ఆ ఆలోచన ఆగిపోయిందని తెలుస్తోంది కానీ.. నో కామెంట్ అని కట్ చేసేంతగా ఏం జరిగింది అనేదే తెలియడం లేదు. అంటే ఇప్పట్లో మెగా థియేటర్ను చూసే అవకాశం లేదన్నమాట.