ఇండియన్ సినిమాలో 1950 – 1960 మధ్య కాలాన్ని స్వర్ణ యుగం అంటారు. అప్పట్లో మన సినిమా దేదీప్యమానం వెలిగిపోయేది. ఆ రేంజి కథలు, నటులు వచ్చేవారు. అందుకే ఇప్పటికీ ఆ రోజుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటి రోజుల గురించి ఇప్పుడెవరైనా సినిమాలు తీస్తుంటే ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నాం. ఈ లైన్తో ఇప్పుడు టాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కింది. అదే ‘కాంత’. ప్రముఖ తమిళ నటుడు ఎం.కె. త్యాగరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది అని సమాచారం.
ఈ సినిమాలో క్యాడ్బరీ గర్ల్ భాగ్యశ్రీ భోర్సేను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఆమె కుమారి అనే పాత్రలో కనిపించబోతోంది. దీంతో అలనాటి హీరోయిన్ పాత్రలో నేటి తరం అమ్మాయా? ఎలా చేస్తుందో అనే డౌట్ చాలామందికి ఉంది. ఎందుకంటే అప్పటి హీరోయిన్లు ఎక్కువగా కళ్లతోనే భావాలు పలికించారు. భాగ్యశ్రీ భోర్సేలో ఆ టాలెంట్ చూసి చాలా ఏళ్ల క్రితమే ఎంచుకున్నారు. ఎందుకంటే ఆమె సౌత్లో ఓకే చేసిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా విడుదల నేపథ్యంలో భాగ్యశ్రీ మాట్లాడుతూ గోల్డెన్ డేస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కుమారి పాత్ర కోసం చెన్నై వెళ్లి మరీ పాత్ర గురించి విషయాలు తెలుసుకుందట భాగ్యశ్రీ. అలనాటి కథానాయికలు సావిత్రి, శ్రీదేవి సినిమాలు, మరికొంతమంది పాత సినిమాల వీడియోలు చూసిందట. సినిమా డైలాగ్ల కోసమే ఆరు నెలల సమయం తీసుకొని ప్రాక్టీస్ చేసిందట. మొన్నీమధ్యే సీనియర్ నటి కుష్బూని కలిసిందట. ఆ సమయంలో నృత్య దర్శకురాలు బృంద కూడా అక్కడే ఉన్నారట. ఆ రోజుల్లోని అనుభవాల్ని వివరించారట.

సోషల్ మీడియా లేని టైమ్లో జీవితం ఎంత వైవిధ్యంగా ఉండేదో చెబుతుంటే ఆసక్తికరంగా అనిపించింది అని భాగ్యశ్రీ చెప్పింది. నాటి రోజుల్ని స్వర్ణయుగం అని ఎందుకంటారో అర్థమైందని చెప్పింది. ఆ కాలానికి నా మనసు దగ్గరగా ఉంటుంది కాబట్టి అప్పుడు కథానాయిక అయ్యుంటే ఇంకా ప్రభావం చూపించేదాన్నేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం దేవుడు నన్ను ఈ కాలం కథానాయికని చేశాడు అంటోంది.
