Polimera 2: కంప్లైంట్ల వరకు వచ్చిన ‘పొలిమేర’ ఇష్యూ… ఏమైందంటే?

  • July 22, 2024 / 12:02 PM IST

హారర్ జోనర్‌ సినిమాల్లో ఇటీవల కాలంలో సరికొత్త ట్రెండ్ సెట్‌ చేసిన సినిమా ‘పొలిమేర’ (Maa Oori Polimera) . ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన భారీ స్థాయిలో విజయం అందుకుంది. ఈ సినిమాకు రెండు పార్టులు వచ్చి మంచి విజయం అందుకోగా, మూడో పార్టు కోసం ప్లాన్స్‌ జరుగుతున్నాయి. ఈ మేరకు ఇటీవల షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ‘పొలిమేర 2’ (Maa Oori Polimera 2) నిర్మాత.. మూడో ‘పొలిమేర’ నిర్మాత మీద కేసు పెట్టారు. చేతబడి, మంత్ర – తంత్రాలు నేపథ్యంలో సాగే సినిమా ‘పొలిమేర’.

కరోనా – లాక్‌డౌన్‌ కాలంలో ఓటీటీలోకి వచ్చి ఈ సినిమా సాధించిన విజయం దృష్టాల.. రెండో పార్టును నేరుగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. రెండో ‘పొలిమేర’కు గౌరవ కృష్ణప్రసాద్ నిర్మాత కాగా, నందిపాటి వంశీ, సుబ్బారెడ్డి డిస్ట్రిబ్యూటర్లు. అయితే నిర్మాతను తాను కాబట్టి వచ్చిన లాభాల్లో వాటా కావాలని కృష్ణ ప్రసాద్‌ వాదిస్తున్నారు. అయితే డబ్బులు అడుగుతుంటే.. చంపేస్తానని బెదిరిస్తున్నాడని వంశీపై కృష్ణప్రసాద్ హైదారాబాద్‍‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

‘పొలిమేర 2’ సినిమాకు రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, సినిమాను పంపిణీ చేసిన వంశీ ఇప్పటివరకు పైసా కూడా ఇవ్వలేదు అనేది కృష్ణ ప్రసాద్‌ వాదన. పోలీసులకు ఫిర్యాదు చేస్తే దానికి తగిన పరిణామాలు ఎదుర్కుంటావు అని కూడా అంటున్నారు అని కృష్ణ ప్రసాద్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘పొలిమేర 2’ సినిమా నిర్మాణానికి రూ. ఆరు కోట్లు ఖర్చు చేశానని, లాభాల్లో 65శాతం ఇస్తానని చెప్పిన వంశీ నందిపాటి, సుబ్బారెడ్డి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిలింఛాంబర్‌లో డిస్కషన్‌ కూడా జరిగింది అని ఫిర్యాదులో కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఈ నెల 9న వంశీ, సుబ్బారెడ్డి తనను జేఎన్టీయూ దగ్గర్లోని రెస్టారెంట్ దగ్గరకు పిలిచారని తెలిపారు. అక్కడికి వెళ్లాక తనను తిట్టి, బెదిరింపులకు పాల్పడ్డారని కృష్ణప్రసాద్‌ పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus