Revanth Reddy: హాలీవుడ్లోనూ అల్లు అర్జున్ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్ వైరల్
- March 13, 2026 / 02:25 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ కొత్త థియేటర్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కోకాపేటలో నిర్మించిన ఈ సరికొత్త మల్టీప్లెక్స్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి తొలుత సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఆ తర్వాత డాల్బీ స్క్రీన్లో కొన్ని సినిమాలను వీక్షించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.
Revanth Reddy
అల్లు కుటుంబ సభ్యులను అభినందిస్తున్నా. నేను సినిమా అభిమానిని. మన దేశంలో సినిమా సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పరంగా సినిమాని ఎంత బాగా తీసినా వాటికి తగ్గ స్క్రీన్లు లేకపోతే వృథానే. డాల్బీ విజన్తో వందలాది మందితో కలసి కూర్చొని సినిమా చూస్తే ఆ ఆనందమే వేరు. నా చిన్నతనంలో లారీలో వనపర్తికి వెళ్లి సినిమాలు చూసేవాడిని. తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను గొప్ప పరిశ్రమగా గుర్తిస్తోంది అని చెప్పారు సీఎం.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కృష్ణా నగర్ను చిన్నచూపు చూడొద్దు. గొప్ప సినిమాలు ఇచ్చిన కళాకారులెందరో అక్కడ ఉన్నారు అని చెప్పారు. టికెట్ కొని సులభంగా సినిమాను జడ్జ్ చేస్తాం. సినిమా తీయడం ఎంత కష్టమో గుర్తించాలి. ‘అల్లు సినిమాస్’ అల్లు కుటుంబానికి ఓ ఎమోషన్. ఎంతో ఇష్టపడి అల్లు అరవింద్ నిర్మించారు. అల్లు సినిమాస్ మన నగరానికి, మన దేశానికి గుర్తింపు తీసుకురావాలి. భవిష్యత్తులో అల్లు అర్జున్ హాలీవుడ్లో కూడా రాణించాలి అని అన్నారు.
మన సినిమాలు హాలీవుడ్ వసూళ్లతో పోటీపడేలా ఎదగాలి. ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ లాంటి సినిమాలు మనం కూడా తీయాలి. సినిమాలకు భాషా సరిహద్దులు చెరిగిపోయాయి. సినీ రంగానికి ప్రతిభావంతులే కావాలి అని అన్నారు. ఇక ‘అల్లు సినిమాస్’లో నాలుగు స్క్రీన్లు ఉన్నాయి. స్క్రీన్ 1లో డాల్బీ విజన్ ఉంది. 75 అడుగులు స్క్రీన్ ఉన్న ఈ స్క్రీన్ ఆసియాలోనే అతి పెద్దది కావడం గమనార్హం. ఉగాది సందర్భంగా ఈ మల్టీప్లెక్స్లో సినిమాలు ప్రదర్శన ప్రారంభమవుతుంది. ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాతో ఈ థియేటర్ అందుబాటులోకి వస్తుందని సమాచారం.
















