Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే
- May 20, 2026 / 04:52 PM ISTByFilmy Focus Desk
గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం మాజీ మిస్ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసు. అత్తవారింట్లో గత వారం అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది ట్విషా. ఆమె మరణానికి సంబంధించి తాజాగా కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Twisha Sharma
ట్విషా శర్మది ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా. 2012లో మిస్ పుణెగా నిలిచిన ఆమె.. కొంతకాలం ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రయత్నాలు చేసింది. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. తెలుగులో 2021లో ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే సినిమాలో నటించింది. ఈ క్రమంలో డేటింగ్ యాప్లో పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్ను ప్రేమించి గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకుంది. వివాహం జరిగిన ఐదు నెలలకు అంటే ఈ నెల 12న అత్తవారింట్లో ఉరివేసుకొని చనిపోయింది.
చనిపోవడానికి ముందు తన తల్లికి.. తాను వేధింపులు, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, జీవితం నరకంలా మారిందని ఏప్రిల్ 30న మెసేజ్ పంపింది. ఈ వివాహ బంధంలో చిక్కుకుపోయానని, సంతోషంగా లేనంటూ తన స్నేహితులకు మెసేజ్లు పెట్టింది. దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం భోపాల్లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. పోలీసులు సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తమ కుమార్తె మరణానికి ఆమె భర్త, అత్త కారణమని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్దవారితో వారికున్న పరిచయాలతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భర్త సమర్థ్ పరారీలో ఉన్నాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి ఆచూకీ చెబితే రూ.10 వేలు ఇస్తామని భోపాల్ పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే ట్విషా కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.













