ఈ వారం విడుదల కావాల్సిన సినిమా నెక్స్ట్ వారం వస్తోంది అంటేనే రిజల్ట్ విషయంలో జనాలు డౌట్స్ పడుతున్న రోజులివి. పొరపాటున సినిమా రెండు వారాలో, రెండు నెలలో లేట్ అయితే ఇంకా ఎక్కుడ డౌట్స్ వస్తున్నాయి. అలాంటిది ఓ సినిమా ఎనిమిదేళ్ల క్రితం విడుదల అవ్వాల్సి ఉండి.. రాకపోతే.. ఇప్పుడు వస్తుంది అనే సమాచారం వస్తే ఇంకెంత డౌట్స్ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఇదే జరుగుతోంది. అదే వెంకట్ ప్రభు ఎప్పుడో 2017లో తెరకెక్కించిన ‘పార్టీ’. జై, షామ్, రెజీనా, సంచిత, నివేదా పేతురాజ్ నటించిన సినిమా ఇది.
వెంకట్ ప్రభు హ్యాంగోవర్ అనే ట్యాగ్లైన్తో ఈ సినిమా అప్పట్లో కొంత సంచలనమే సృష్టించింది. ఎందుకంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు వెంకట్ ప్రభు సినిమాలకు మంచి హిట్ ట్రాక్ రికార్డు ఉంది. అయితే బడ్జెట్, రాయితీలు తదితర సమస్యలతో అప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు సమస్యలు అన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేస్తారని సమాచారం..
ఆ మధ్య విశాల్ – అంజలి – వరలక్ష్మి సినిమా ‘మదగజరాజా’ సినిమా కూడా ఇలానే ఏళ్ల తరబడి ఉండిపోయింది ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత విడుదలైంది. సుందర్.సి తెరకెక్కించిన ఆ సినిమా అనూహ్యంగా హిట్ అయింది. మరిప్పుడు ‘పార్టీ’ కూడా అలానే హిట్టవుతుందా అనేది చూడాలి. మామూలుగా అయితే ఇలాంటి సినిమాల విజయం అంత ఈజీ కాదు. అయితే వెంకట్ ప్రభు సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి. కాలానికి కాస్త ముందుకెళ్లి తీస్తారు. కాబట్టి విజయం సాధించే ఛాన్స్ ఉంది.
అసలెందుకు లేటు అనేదేగా మీ డౌట్. ఈ సినిమాను ఎక్కువగా ఫిజీలో తెరకెక్కించారు. ఈ క్రమంలో సినిమా నిర్మాణం కోసం ఆ దేశంతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారట. అందులో భాగంగా ఆ దేశ ప్రభుత్వానికి చెల్లించి ఫీజుల్లో 47 శాతం వెనక్కి రాయితీగా ఇవ్వాలట. అయితే సినిమా పూర్తయ్యాక ప్రపంచంలో కొవిడ్ పరిస్థితులు వచ్చాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదుపులకు గురై ఫిజీ ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వలేదట. ఇప్పుడు ఈ విషయంలో స్పష్టత వస్తుండటంతో నిర్మాత సినిమా విడుదలకు ముందుకొచ్చారట.