నాగార్జున సినిమాల్లో మంచి హైప్, భారీ స్టార్ కాస్ట్, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అంటే కచ్చితంగా గుర్తొచ్చే సినిమాల్లో ‘చంద్రలేఖ’ ఉంటుంది. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలా ఇదీ మంచి విజయం అందుకుంటుంది అని అందరూ అనుకున్నా.. ఆశించిన ఫలితం అయితే రాలేదు. అయితే ఆ సినిమాలో నాగ్ నటన, కొన్ని సన్నివేశాలు, పాటలు చాలా ఆకట్టుకున్నాయి. 1998లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతోపాటు రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను నటి ఇషా కొప్పికర్ గుర్తుచేసుకున్నారు. సినిమాలోని ఓ సన్నివేశం అనుకున్నట్లుగా రావడానికి నాగార్జునతో కావాలనే చెంపదెబ్బలు తిన్నట్లు తెలియజేసింది. ‘చంద్రలేఖ’ సినిమాలో నాగార్జున నన్ను కోపంగా కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సీన్ బాగా రావడం కోసం నేను ఆయనతో నిజంగానే కొట్టమని చెప్పాను. ఆయన తొలుత చాలా చిన్నగా కొట్టారు. దీంతో సన్నివేశం సరిగ్గా రాలేదు. దాంతో ‘నాకు కోపం రావడం లేదు. గట్టిగానే కొట్టండి’ అని మరోసారి చెప్పాను అని తెలిపింది.
అలా ఆ సీన్ బాగా రావడం కోసం 15 రీటేక్లు తీసుకున్నాం. ఆ సన్నివేశం అయ్యాక చూస్తే నా మొహమంతా కందిపోయింది. చెంప మీద వాతలు దేరాయి. దీంతో నాగార్జున చాలా బాధపడి క్షమాపణలు చెప్పారు. అప్పుడు బాధ పడొద్దు అని నేను అన్నాను. సీన్ డిమాండ్ చేస్తే ఇలాంటివి సహజమని కూడా చెప్పాను అని ఇషా గుర్తు చేసుకుంది. ఇక ‘వరప్రసాద్’ (1997) అనే సినిమాలో అతిథి పాత్రతో తెలుగు సినిమాకు పరిచయమైన ఇషా.. రెండో సినిమాగా ‘చంద్రలేఖ’ చేసింది. 2017లో నిఖిల్ ‘కేశవ’లో ఆమె నటించింది. మరోవైపు హిందీలో సినిమాలు, వెబ్సిరీసుల్లో బిజీగా ఉంది. కన్నడ, మరాఠీ సినిమాలు కూడా చేసింది. మధ్యలో రాజకీయాల్లోకి కూడా వెళ్లింది.