Maheshbabu: మా ముగ్గురిలో కామన్ పాయింట్ అదే: మహేష్బాబు
- February 4, 2026 / 08:32 PM ISTByFilmy Focus Desk
‘వారణాసి’ సినిమా గురించి ఆ మధ్య మిడ్నైట్ ముచ్చట్లు జరిగాయి గుర్తుందా? సినిమా పరిచయ కార్యక్రమం త్వరలో చేస్తాం అని చెప్పకనే చెబుతూ ఓ ట్వీట్ల కార్యక్రమం చేశారు. ఆ రాత్రి చాలా మంది ఆ కంటెంట్ మిస్ అయ్యారు. ఉదయం లేచాక చూసుకొని ఏంటిది అనుకున్నారు. ఇప్పుడు మరోసారి సినిమా టీమ్ అర్ధరాత్రి ముచ్చట్లు కార్యక్రమం నిర్వహించింది. ఈసారి ఇంటర్వ్యూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కొన్ని ఆసక్తికర వివరాలు ఉన్నాయి.
Maheshbabu
గతంలో పలు సందర్భాల్లో చెప్పినట్లే 15 ఏళ్ల కిత్రమే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందని, ఇప్పటికి కుదిరిందని మహేష్ చెప్పుకొచ్చాడు. ఓసారి రాజమౌళి ఆఫీసుకు పిలిచి ‘వారణాసి’ స్క్రిప్ట్ గురించి చెప్పారని, కథ వినగానే ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఇందులో హీరోగా చేయడానికి మొదట్లో భయపడ్డానని, రాజమౌళి కథను వివరించిన విధానం తన భయాన్ని పోగొట్టిందని చెప్పాడు మహేష్.

ఇక సినిమాలో లుక్స్ కోసం రిహార్సల్స్ చేశామని, 2024 నుంచి ఇదే పనిలో ఉన్నామని లుక్ వెనుక కథ చెప్పాడు. తాను ఈ సినిమాలో పోషిస్తున్న రాముడు పాత్ర గురించి కూడా చెప్పాడు మహేష్. రాముడికి ప్రత్యేకమైన భంగిమ ఉంటుందని, నిలబడే విధానం దగ్గర నుండి నటించడం వరకూ రిహార్సల్స్ చేశామని చెప్పాడు. దీని కోసం మూడు నెలలు పట్టిందని కూడా చెప్పాడు.
తాను పరిగెత్తే విధానాన్ని కూడా రాజమౌళి మార్చేశారని, దాని కోసం ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్పారు. సినిమాలో రెండు షాట్ల కోసం ఇదంతా చేశామని చెప్పాడు మహేష్. ఇక ఈ సినిమాలో నటిస్తున్న మరో ఇద్దరు కీలక పాత్రధారుల గురించి కూడా చెప్పారు. తమ ముగ్గురు విషయంలో కామన్గా ఒక విషయం ఉందని చెప్పారు. షాట్ కట్ చెప్పాక ముగ్గురం మానిటర్ ముందుకు వెళ్లే రకం కాదని తెలిపారు.
















