ఎప్పుడో పెట్టిన సోషల్ మీడియా పోస్టుని ఇప్పుడు బయటకు తీసి ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. అయితే ఆ పోస్టు మంచి కోసం రాసి ఉంటే ఇబ్బందేమీ లేదు. సెటైరికల్గా ఆ పోస్ట్ పెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్న యువ దర్శకుడు విజయ్ కనకమేడల అండ్ ‘భైరవం’ (Bhairavam) సినిమా టీమ్. మంచి వైబ్తో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ‘బాయ్కాట్ భైరవం’ పిలుపులు పెద్ద కుదుపునకే గురి చేశాయి. తొలుత వైసీపీ వాళ్లు అంటే.. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ అందుకున్నారు.
తాజాగా ఈ విషయం మీద ‘భైరవం’ సినిమా హీరోల్లో ఒకరైన మంచు మనోజ్ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ ఎమోషనల్గా మాట్లాడుతూ విజయ్ కనకమేడల తరఫున క్షమాపణలు చెప్పుకొచ్చారు. ఇటీవల తమ సినిమా విషయంలో బాయ్కాట్ ట్రెండ్ నడిచిందని అంశాన్ని ఎత్తుకున్న ఆయన.. దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు. పదిమందికి సేవ చేస్తూ ఉంటారని, అలాంటాయన ఏదో పోస్టు పెట్టారంటూ కొందరు అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు అని చెప్పాడు మనోజ్.
చిరంజీవి (Chiranjeevi), పవన్ కల్యాణ్కు (Pawan Kalyan) విజయ్ కనకమేడల వీరాభిమాని. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అందరూ ఒక్కటై మనల్ని ఒంటరిని చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. విజయ్ విషయంలో అలాంటి పరిస్థితి వద్దు. వేరే ఎవరైనా అంటే విజయ్ పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన తన కుటుంబంలా భావించిన మెగా అభిమానులే విమర్శిస్తుంటే ఆయన్ను చూడలేకపోతున్నా అని అన్నాడు మనోజ్. ఈ సినిమాకి మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నా అని అన్నారు మనోజ్.
విజయ్ సోషల్ మీడియాలోని పోస్టు విషయంలో ఇబ్బంది ఫీలైతే మా టీమ్ తరఫున మెగా అభిమానులు అందరికీ క్షమాపణలు. సినిమా అనేది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఎంతోమంది కష్టంతో కూడుకున్న విషయం. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత నేను నటించిన సినిమా ఇది. నన్ను, నా సినిమాను ఆశీర్వదించండి అని కోరాడు మనోజ్.