Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు ముహూర్తం ఫిక్స్
- February 24, 2026 / 01:34 PM ISTByFilmy Focus Desk
నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ చాలా ఏళ్లు వెయిట్ చేయించి ‘సింబా’ అంటూ ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది అని చెప్పారు. అయితే రేపో మాపో సినిమా ముహూర్తం అనగా.. వాయిదా వేసేశారు. ఆ తర్వాత మళ్లీ అదిగో, ఇదిగో అని డేట్స్ చెప్పి.. ఇప్పుడు కామ్గా ఉన్నారు. ఈలోపు క్రిష్ పేరు చర్చల్లోకి వచ్చింది. బాలకృష్ణ మనసులోని కథను క్రిష్ హ్యాండిల్ చేస్తారని చెప్పారు.
Mokshagna
ఈ మాట లీకుగా వచ్చి కూడా చాలా రోజులైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ మీద డౌట్స్ రావడం మొదలయ్యాయి. అసలు మోక్షజ్ఞ ఎందుకు డెబ్యూ చేయడం లేదు అనే ప్రశ్నలు మొదలయ్యాయి. 31 ఏళ్లు దాటిపోయినా సినిమాల్లోకి రాకపోతే ఎలా అనే చర్చలు వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటికీ తెరపడే రోజు దగ్గరకొచ్చింది. ఈ సినిమా ముహూర్తపు షాట్కి ముహూర్తం తీశారు అని టాలీవుడ్ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తెలుగు సంవత్సరాదికి సినిమాకు కొబ్బరికాయ కొడతారు అని చెబుతున్నారు.
అంటే, మార్చి 19న ‘ఆదిత్య 369’ సినిమాకు కొనసాగింపు అయిన ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమా మొదలుకాబోతోంది. చాలా ఏళ్లుగా బాలకృష్ణ తన మనసులో దాచుకున్న సినిమా ఇది. కొన్నేళ్ల క్రితం తనే నటిస్తూ, దర్శకత్వం వహించాలి అనుకున్నారు. ఈ మేరకు రెండు మూడుసార్లు ప్రకటన కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత మనసు మార్చుకుని మోక్షజ్ఞ కథానాయకుడిగా ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అప్పుడే కొంతమంది దర్శకుల పేర్లు వినిపించి.. ఫైనల్గా క్రిష్ పేరు ఫిక్స్ అయింది.
అన్నట్లు ఆ మధ్య బాలయ్య మాట్లాడుతూ ‘‘మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదారు స్క్రిప్ట్స్ నా మైండ్లో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. అందులో ఒకటే ఈ ‘ఆదిత్య 999 మ్యాక్స్’. ఇదయ్యాక అవన్నీ బయటకు వస్తాయి.
















