Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?
- March 14, 2026 / 10:32 PM ISTByFilmy Focus Desk
గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ అలియాస్ నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్. మనకు ఎన్నో ఏళ్లుగా తెలిసిన హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. ఎవరూ ఊహించని పాత్రలు వేసి టాలీవుడ్లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మధ్య మధ్యలో నోరు జారి, మాట తూలి నానా ఇబ్బందులు కూడా పడ్డారు. క్షమాపణలు, కన్నీళ్లు, బాధలు పడి ఆయన తప్పును కడిగేసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి ఇలానే మాట తూలి తమిళ దిగ్గజ నటుడు, దివంగత ఎంజీఆర్ను ఏదేదో అనేశారు. ఇప్పుడు నాలుక కరుచుకొని సారీ చెప్పారు.
Rajendra Prasad
ఇక్కడి వరకు అంతా బాగుంది. ఆయన అనడం కొత్త కాదు, ఆ తర్వాత కవర్ చేసుకోవడం, క్షమాపణలు చెప్పడం కొత్త కాదు. అయితే ఇక్కడ కొత్తగా ఓ విషయం జరిగింది. అదే ఆయనకు పద్మశ్రీ పురస్కారం రావడం. తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలకుగాను రాజేంద్ర ప్రసాద్కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. అలాంటి ఉన్నత పురస్కారాలు అందుకున్నాక ఉండాల్సిన జాగ్రత్తను ఏ మాత్రం పట్టించుకోకుండా నోరు జారారు రాజేంద్ర ప్రసాద్.
పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలు ఇవి. వీటిని అందుకున్న వ్యక్తుల్ని గౌరవంగా చూస్తుంది దేశం. ఆ గౌరవానికి తగ్గట్టే వారు కూడా మసులుకోవాల్సి ఉంటుంది. చేసే పనులు, వాడే భాష నలుగురికి ఆదర్శంగా ఉండేలా చూసుకోవాలి. చాలామంది పద్మ పురస్కార గ్రహీతలు ఇలానే ఉంటున్నారు కూడా. కానీ టాలీవుడ్కి చెందిన కొంతమంది భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. నోటి దురుసుతో ఇబ్బందిపడుతున్నారు.
ఇదంతా చూశాక పద్మ పురస్కారాల విషయంలో కేంద్రం ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి రాజేంద్ర ప్రసాద్కు అవార్డు వచ్చినప్పుడు కూడా ఈ కామెంట్లే వినిపించాయి. గతంలో ఆయన అలీ, రోజా తదితర నటుల్ని నోటికొచ్చింది అన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు కొడుతున్నాయి కూడా.











