మంచు మోహన్బాబు (Mohan Babu) కుటుంబంలో ఏం జరుగుతోందో, ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతా ఆ కుటుంబ విషయం అని వదిలేద్దాం అంటే రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్లు ఇస్తున్నారు, మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అందుకే ఆయన ‘మంచు విలేజ్’ జరుగుతున్న రచ్చ గురించి అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆ మధ్య ఇంట్లోకి రానివ్వడం లేదని, జనరేటర్లో పంచదార పోశారని.. నానా రకాల రచ్చ జరిగింది. ఇప్పుడు కార్లు దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది.
మోహన్ బాబు కుటుంబంలో రచ్చ కాస్త తగ్గింది.. ఆయన ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారేమో అని అనుకుంటుండగా.. మంచు మనోజ్ (Manchu Manoj) మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. సోదరుడు మంచు విష్ణుపై (Manchu Vishnu) నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతోపాటు ఇతర వస్తువులను దొంగిలించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. జల్పల్లిలోని ఇంటిలో 150 మంది చొరబడి విధ్వంసం చేశారని, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకొని వెళ్లారు అనేది ఆ ఫిర్యాదు పూర్తి సారాంశం.
అక్కడితో ఆగకుండా తన ఇంట్లో చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో ఉన్నాయని కూడా మనోజ్ చెప్పాడు. తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం రాజస్థాన్కి వెళ్లామని, తిరిగి ఇంటికి వచ్చి చూస్తే.. దొంగతనం జరిగింది అని మనోజ్ చెబుతున్నాడు. ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రితో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదన్నారు.
ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని మనోజ్ పోలీసుల్ని కోరాడు. దీంతో మరోసారి మంచు రచ్చ మీడియాకెక్కింది అని చెప్పాలి. అయితే ఈ విషయంలో విష్ణు స్పందన బట్టి అక్కడేం జరిగింది అనేది ఇంకాస్త క్లియర్గా తెలుస్తుంది. మరి గతంలో మాదిరిగా మోహన్బాబు ఏమన్నా వాయిస్ మెసేజ్లు, ప్రత్యేక ప్రెస్ నోట్స్ విడుదల చేస్తారేమో చూడాలి.