రాశీ ఖన్నా.. తెలుగులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. తమిళంలో కూడా మంచి సినిమాలే చేసింది. అయితే ఏమైందో ఏమో ఒక్కసారి ఆమె ఎంపిక చేసుకున్న సినిమాల ఫలితాలు కాస్త అటు ఇటు అయ్యాయి. అదే సమయంలో ఆమె బాలీవుడ్కి రీఎంట్రీ ఇవ్వడానికి వెళ్లింది. తెలుగులో సినిమా ఛాన్స్లు తగ్గిపోతూ వచ్చాయి. కొన్ని నెలలు అయితే తెలుగులో సినిమాలే చేయలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది హీరోయిన్గా వచ్చినా సరైన ఫలితం దక్కలేదు. ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమానే ఉంది.
Rashi Khanna
అయినా, ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? 12 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ చేయని ఐటమ్ సాంగ్ని ఇప్పుడు చేస్తాను అంటోంది. అవును స్పెషల్ సాంగ్కి రాశీ ఓకే చెప్పిందట. సంక్రాంతి బరిలో ఉన్న నవీన్ పోలిశెట్టి సినిమా ‘అనగనగా ఒక రాజు’లోనే ఈ సాంగ్ ఉండబోతోంది. ముందుగా అనుకున్న ప్లానింగ్లో ఈ పాట ఆలోచన లేదట. అయితే మాస్ ఆడియన్స్ కోసం ఓ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని టీమ్ భావించి.. రాశీని సంప్రదించింది అని సమాచారం.
తొలుత ఈ పాట కోసం కొత్త హీరోయిన్లను అనుకున్నా.. అటు తిరిగి ఇటు తిరిగి రాశీ దగ్గరకు వచ్చారని సమాచారం. ఈ పాటను డిసెంబరు 31లోపు పూర్తి చేసే ఉద్దేశంలో టీమ్ ఉందట. ఎందుకంటే సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తామని టీమ్ ఇప్పటికే చెప్పింది. అయితే, సినిమా షూటింగ్ పూర్తయి ఇన్ని రోజులు అయ్యాక ఇప్పుడు స్పెషల్ సాంగ్ యాడింగ్ ఆలోచన ఎందుకు చేశారు అనేది అర్థం కావడం లేదు.
సంక్రాంతికి బరిలో ఉన్న సినిమాల్లో అందాల మోతాడు, మాస్ టచ్.. చూసుకున్నాక ఈ పాట ఆలోచన చేశారు అని సమాచారం. మరి ఈ పాటను సరిగ్గా లింక్ చేస్తారో లేదో చూడాలి. ఎందుకంటే హడావుడి పనులు ఇబ్బందులకు దారి తీస్తాయి. ఈ సినిమాతో కలిపి మొత్తం ఐదు సినిమాలు పొంగల్ ఫైట్లో ఉన్నాయి. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, ‘ది రాజా సాబ్’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఆ సినిమాలు.