ఎంత బ్లాక్బస్టర్ సినిమా అనిపించుకున్నా.. ఎక్కడో ఏదో చిన్న వెలితి ఉంటుంది అంటుంటారు. ప్రేక్షకులు కూడా ఈ మాట అనడం మంన తరచూ వింటూ ఉంటాం. ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది అని చెబుతున్న ‘కుబేర’ (Kuberaa) సినిమా విషయంలోనూ ఓ చిన్న వెలితిని వెలిబుచ్చుతున్నారు ప్రేక్షకులు. అదే ఈ సినిమా నిడివి. కొన్ని చోట్ల మరీ ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సన్నివేశాల్లో సాగదీత కనిపిస్తోందని, దాంతో నిడివి పెరిగింది అనేది కొంతమంది వాదన.
తాజాగా ఈ విషయంలో ఆ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) స్పందించారు. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక మందన ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’ (Kuberaa) ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ఈ రోజు హైదరాబాద్లో జరిగింది. ఈ క్రమంలో సినిమా రన్ టైమ్ గురించి ప్రస్తావన వచ్చింది. సినిమా నిడివి విషయంలో కొంతమంది కామెంట్స్ తన వరకు వచ్చాయని శేఖర్ కమ్ముల (Sekhar Kammula) చెప్పుకొచ్చారు.
అయితే అవసరమైనప్పుడు సినిమాకు కత్తెర వేయాని దర్శకుడు లేదా టీమ్కు తెలియని విషయం కాదని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు దర్శకుడు. సినిమాలో ఆయా సన్నివేశాలు ఉండాలి.. ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు దానిని అందుకు తగ్గట్టుగా రూపొందించడమే ధర్మం. ఈ సినిమాకు ఆ సన్నివేశాలు అవసరం. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో కోణాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిడివిలో ఆ సినిమాను తీసుకురావాల్సి వచ్చింది అని శేఖర్ కమ్ముల (Sekhar Kammula) చెప్పుకొచ్చారు.
దీంతో సినిమా నిడివి విషయంలో ఆయన చాలా క్లియర్గా ఉన్నారు అనేది అర్థమువతోంది. సినిమా సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అయితే కొన్ని సన్నివేశాలను తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన పెట్టారని.. వాటిని ఓటీటీ వెర్షన్లో తీసుకొచ్చే ఆలోచన చేయొచ్చు అని చెబుతున్నారు. మరి అందులో ఇంకేం సీన్స్ చూపిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.