Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?
- May 3, 2026 / 10:01 AM ISTByFilmy Focus Desk
తమిళ సినిమా పరిశ్రమలో ఇలా జరుగుతుంది కొన్ని రోజుల క్రితం చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. అబ్బే కష్టమే అంత సీన్ ఉండదు అని అన్నారు కొందరు. కట్ చేస్తే శనివారం నుండి తమిళ సినిమా పరిశ్రమలో షూటింగ్లు అగిపోయాయి. ఎందుకంటే తమిళ సినీ నిర్మాతలు మొన్నీమధ్య నిర్ణయం తీసుకున్నట్లు సమ్మెకు దిగారు. నటులు, సాంకేతిక నిపుణులు రెవెన్యూ షేరింగ్ విధానంలో పారితోషికం తీసుకోవాలని నిర్మాతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నటీనటుల సంఘం నుండి స్పందన కూడా కోరారు.
Tamil Cinema
అయితే, ఈ విషయంలో నడిగర్ సంఘం నుండి స్పందన రాకపోవడంతో టోకెన్ స్ట్రైక్కు తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మే 2 నుండి షూటింగ్స్ నిలిపేశారు. గత మూడేళ్లుగా ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు బాగా పెరిగాయని చెబుతున్న నిర్మాతలు.. ఒకవేళ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకపోతే తాము మాత్రమే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిర్మాతలు అంటున్నారు. సినిమా పరంగా ప్రొడ్యూసర్కు నష్టం వాటిల్లితే సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో తమ పరిస్థితి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఒక్క రోజు సమ్మె చేస్తున్నట్టు శనివారం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ లెక్కన ఆదివారం నుండి సినిమా షూటింగ్లు తిరిగి మొదలవుతాయి. అయితే, ఒక రోజు సమ్మె కాస్తా పూర్తి సమ్మెగా మారితే పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నగా మిగిలింది. మరి నటులు రెవెన్యూ షేరింగ్ విషయంలో ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
సమ్మె నిర్ణయం చెప్పినప్పుడే థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత ఓటీటీలోకి రావడం విషయంలోనూ నిర్మాతలు కొన్ని ఆలోచనలు చేశారు. సినిమా విడుదలైన 6 నుండి 8 వారాల పాటు ఓటీటీ స్ట్రీమింగ్కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. మిడ్ రేంజ్ సినిమాలకు ఆరు వారాలు, భారీ సినిమాలకు 8 వారాలు అని నిర్ణయించారు. అయితే ఈ విధానం గురించి కొన్ని నెలల క్రితం టాలీవుడ్లోనూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకట్రెండు సినిమాలకు తప్ప వేరే సినిమాలకు పాటించడం లేదు. మరి సమ్మె తరహాలోనే.. ఈ విషయంలో కూడా సీరియస్గా పాటిస్తారేమో చూడాలి.










