Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్ని తన స్టైల్లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?
- May 2, 2026 / 11:58 PM ISTByFilmy Focus Desk
తెలిసినవాళ్లతో, తెలియనివాళ్లతో ఏ కారణం లేకుండానే మాటలు పడేవాళ్లు.. స్ట్రాంగ్ అయిపోతారు అంటారు. ఇలా మాటలు పడేవాళ్లలో ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మీ గౌతమ్ కూడా ఉంది. సమాజంలో జరిగే వివిధ అంశాలపై ముఖ్యంగా జంతు సంరక్షణ అంశాలపై తరచుగా స్పందిస్తూ ఉంటుంది. వాటికి సంరక్షణ కోసం పోరాడుతూ ఉంటుంది రష్మీ. ఈ క్రమంలో ఆమెను తెగ ట్రోల్ చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. రీసెంట్ ఆమె ఓ విషయం స్పందిస్తే.. ఇప్పుడు అది రాజకీయ రంగు పులుముకొని పెద్ద చర్చ అయింది. ఆమె కూడా ట్రోలింగ్ బారిన పడింది. తాజాగా దీనిపై రష్మీ తనదైన శైలిలో రియాక్ట్ అయింది.
Rashmi
తాను ఏ మతానికి, పార్టీకి వ్యతిరేకం కాదని.. జంతువులపై కొంతమంది చూపించే క్రూరత్వానికి మాత్రమే వ్యతిరేకమని రష్మి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వైకాపా నేత ప్రదీప్ చింత తనపై చేసిన విమర్శలపై ఎక్స్ వేదికగా రష్మీ రియాక్ట్ అయింది. విమర్శలు ఎదుర్కోవడం నాకు కొత్త కాదని, గతంలోనూ అనేక సందర్భాల్లో తాను వేధింపులకు గురయ్యానని ఆమె రాసుకొచ్చింది. ఇప్పుడు ఇది కూడా అంతే అని చెప్పింది.
ఇలాంటి అవమానాలు నాకు మొదటిసారి కాదు. పండుగల సమయంలో జరిగే జంతు బలిపై నేను మాట్లాడుతూనే ఉన్నాను. అలా మాట్లాడిన రోజుల్లోనూ నన్ను తిట్టారు. చివరకు గణపతికి గజమాల వేసే క్రమంలో అంకుశంతో ఏనుగు చర్మాన్ని ఎవరో చీలుస్తుంటే దానిపై ప్రశ్నించినందుకు కూడా నన్ను దేశ ద్రోహి అన్నారు. జంతువులపై జరిగే హింస విషయంలో ఎవరైనా మాట్లాడితే ఒక అంశాన్ని మరొకదానితో పోలుస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప, పరిష్కారం గురించి ఆలోచించట్లేదు అని రష్మీ రాసుకొచ్చింది.

జంతువులపై జరుగుతున్న హింసపై భవిష్యత్తులోనూ ఇలానే మాట్లాడతాను. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీ జంతు సంక్షేమం కోసం కృషి చేస్తుందో నేను ఆ పార్టీకి బహిరంగంగా మద్దతిస్తాను అని రష్మీ ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఇక అసలేం జరిగిందో చూస్తే.. కొన్ని రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా ర్యాలీ చేశారు.
ఆటోను ఎడ్ల బండిపై పెట్టి ర్యాలీ చేయడాన్ని చూసిన రష్మి రాజకీయ నిరసనల కోసం జంతువులను హింసించడం సరికాదు అని ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వాటికే ఆమె ఇప్పుడు రిప్లై ఇచ్చింది.













