కొడుకు సినిమా ఆడుతున్న థియేటర్కి వెళ్లి ఎవరైనా తండ్రి బయటే కూర్చుని సినిమా అయ్యాక వచ్చేస్తారా? ఏమో వేరే తండ్రుల సంగతి తెలియదు కానీ.. సునీల్ శెట్టి అయితే ఇలానే చేశాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా సరైన విజయాలు లేని బాలీవుడ్కు ‘ఛావా’, ‘ధురంధర్’ లాంటి సినిమాలు మళ్లీ పూర్వపు కళను తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. వీటికి యాడ్ అయిన సినిమా ‘బోర్డర్ 2’. ఈ నేపథ్యంలోనే సునీల్ శెట్టి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
‘బోర్డర్ 2’లో సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి ఓ ముఖ్యపాత్రలో నటించాడు. అయినా ఆ సినిమాను సునీల్ చూడలేదు. ఎందుకు అని అడిగితే.. రూ.500 కోట్లు వసూలు చేసేంత వరకూ ‘బోర్డర్ 2’ సినిమాను చూడను అని సునీల్ ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు ఈ విషయాన్ని సినిమా ప్రారంభమైన రోజు నుండి చెబుతూనే ఉన్నాడట. అందుకే ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించి సింగిల్ ఫ్రేమ్ కూడా చూడలేదు అని చెప్పాడు సునీల్ శెట్టి.
ఇదంతా చూసి తనకు అహంకారం ఉంది అనుకోవద్దు అంటున్నాడు. సినిమాపై ఉన్న నమ్మకంతో అలా అన్నాను అని.. అనుకున్నట్లుగానే ఈ సినిమా మంచి విజయం అందుకుంది అని చెఉప్పాడు. అయితే సినిమా చూడకపోయినా రిలీజ్ అయిన రోజు తొలి ఆట వేస్తున్నప్పుడు థియేటర్ బయటే కూర్చున్నాడు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుల స్పందన తెలుసుకుని ఉప్పొంగిపోయాడు. అహాన్ యాక్టింగ్ను ప్రేక్షకులు మెచ్చుకోవడం చూసి ఆనందపడ్డాడు.
ఇప్పుడు సినిమా వసూళ్లు రూ.500 కోట్లు మైలురాయి దాటిన తర్వాత అహాన్, అతడి స్నేహితులు, నా కుటుంబంతో కలసి చూస్తా అని చెప్పాడు సునీల్ శెట్టి. ఆ ప్రత్యేక షోకు సన్నీ డియోల్, వరుణ్ ధావన్ను కూడా తీసుకొస్తా అని చెప్పాడు. వాళ్లిద్దరూ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు అనే విషయం తెలిసిందే. 28 ఏళ్ల క్రితం విడుదలై సూపర్హిట్ అయిన ‘బోర్డర్’కు సీక్వెల్ ‘బోర్డర్ 2’. ఈ నెల 23న విడుదలై తొలి వారంలో రూ.300 కోట్లకుపై వసూళ్లు సాధించింది.