కొంతమంది నటులు ఉంటారు.. డబ్బులు వస్తాయి అంటే అది ఏ యాడ్, సమస్యలు వస్తాయా లేదా అనేది చూడకుండా ఓకే చేసి.. అది నా టాలెంట్ అని అనుకుంటారు. ఇంకొంతమంది నటులు ఉంటారు ఓ యాడ్ చేశాక సమస్య వచ్చింది, వస్తుంది అనిపిస్తే ఇక అటువైపే చూడరు. ఇప్పుడు మూడో రకం నటులు ఉన్నారు. ఆ యాడ్ వల్ల డబ్బులు బాగా వస్తాయని తెలిసినా.. ఎట్టి పరిస్థితుల్లో చేయరు. అలాంటి నటుల్లో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ఒకరు.
హానికారక ప్రొడక్ట్లకు ప్రచారం చేసే అవకాశం వస్తే.. కచ్చితంగా నో చెప్పే హీరోలు ఇప్పుడు ఉండొచ్చు. కానీ కొన్నేళ్ల క్రితం ఇలాంటి యాడ్స్ని నటులు బాగా చేస్తున్న సమయంలోనే సునీల్ శెట్టి నో చెప్పారు. ఇటీవల ఈ విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయమంటూ ఓసారి ఆయన వద్దకు ప్రపోజల్ వస్తే రిజెక్ట్ చేశారు. ఆ యాడ్ కోసం రూ.40 కోట్లు ఆఫర్ చేసినా నో చెప్పానని తెలిపారు. ఇదంతా తన పిల్లలు అహాన్, అతియాకు ఆదర్శంగా ఉండాలనే అని చెప్పారు.

అలాంటి యాడ్స్ చేస్తే.. తన పిల్లలకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఆ యాడ్ చేయలేదు అని తెలిపారు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య వరుస సినిమాలు చేసిన సునీల్ శెట్టి.. ఒక్కసారిగా కామ్ అయిపోయి.. ఇప్పుడు తిరితగి నటిస్తున్నారు. దీని వెనుక కారణాన్ని కూడా తెలియజేశారు. 2014లో తన తండ్రి అనారోగ్యానికి గురయ్యారని, అప్పటి నుండి ఆయన్ను చూసుకుంటూ ఉండిపోయానని, అదే సమయంలో మనసు బాగోకపోవడంతో నటించలేదని తెలిరాఉ.
2017లో తండ్రి చనిపోయాక.. కొన్ని రోజులకు ఓ రియాలిటీ షోకు హోస్ట్గా చేసే అవకాశం వచ్చిందని అలా తన రీఎంట్రీ మొదలైందని చెప్పాడు సునీల్. ఆవెంటనే కొన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడంతో సౌత్లో నటించానని తెలిపారు. తెలుగులో సునీల్ శెట్టి మంచు విష్ణు ‘మోసగాళ్లు’, వరుణ్ తేజ్ ‘గని’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
