విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బెస్ట్ సినిమాల లిస్ట్ రాస్తే.. అందరి టాప్ 3లో ఓ సినిమా పక్కాగా ఉంటుంది. అదే ‘96’. ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిష (Trisha) కథానాయికగా నటించింది. మనసుని హత్తుకునే ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ ఘనతను అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుంటే ఛానల్ మార్చని ప్రేక్షకులు ఉన్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు ప్రేమ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన చెప్పేది వింటుంటే విజయ్ నుండి ది బెస్ట్ అని ఇన్నాళ్లూ అనుకుంటున్న ‘96’ పర్ఫార్మెన్స్ మిస్ అయ్యేవాళ్లం. ఎందుకంటే ఈ కథ విజయ్ సేతుపతి కోసం రాయలేదని ఆయన చెప్పారు. వేరే హీరోని దృష్టిలో ఉంచుకుని కథ సిద్ధం చేశానని ఓ ఓ చర్చా కార్యక్రమంలో చెప్పారు. ‘96’ సినిమాను తొలుత హిందీలో తెరకెక్కించాలనుకున్నారట. ఆ మార్కెట్కు అనుగుణంగానే కథ సిద్ధం చేశారట. అంతేకాదు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) హీరోగా ఆ సినిమా రూపొందించాలనుకున్నారట.
అయితే ఆ సమయంలో అభిషేక్ను ఎలా సంప్రదించాలో తెలియలేదు అని చెప్పారు. కాంటాక్ట్స్ దొరక్క ఆ ఆలోచనను వదులుకున్నానని చెప్పారాయన. ప్రేమ్ కుమార్ వాళ్ల కుటుంబం ఉత్తరాదిలోనే పెరిగారట. హిందీ సినిమాలనే ఎక్కువగా చూసేవారట. అందుకే ‘96’ సినిమా హిందీలో చేయాలి అనుకున్నారట. ఇక ‘96’ సినిమా గురించి చూస్తే.. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట సుమారు 20 ఏళ్ల తర్వాత స్కూలు రీయూనియన్లో కలిస్తే..
వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రేమ్ కుమార్ ఇప్పటికే తెలిపారు. స్క్రిప్టు పూర్తయిందని, విజయ్ సేతుపతి, త్రిష అందుబాటులో వస్తే సినిమా ప్రారంభిస్తా అని తెలిపారు. ఇక ఈ సినిమానే తెలుగులో ‘జాను’ (Jaanu) పేరుతో శర్వానంద్ (Sharwanand), సమంత (Samantha) చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు.