హీరో కొడుకు హీరో అవుతున్నాడు అంటూ ఎంత కంగారు ఉంటుంది, ఎంత భయం ఉంటుంది, ఒక సినిమా హిట్ కొట్టడం కాదు.. అన్ని సినిమాలూ విజయం సాధించాలి అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి విజయం రాకపోతే ఏమవుతుందో అఖిల్ అక్కినేనిని చూస్తే అర్థమవుతుంది. అయితే స్టార్ హీరో తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలు చేయాలనే ఆలోచన ఏమాత్రం లేని కథానాయకుడు ప్రణవ్ మోహన్ లాల్.
ఎప్పుడో ఏడేళ్ల క్రితం ‘ఇరుపతియొన్నం నూట్టండు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్ వరుసగా సినిమాలు చేసిందే లేదు. రెండు, మూడేళ్లకు సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి మరో యాక్టర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెనే మోహన్ లాల్ కుమార్తె విస్మయ. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో భావోద్వేగభరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ ‘తుడక్కం’ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో ఆశిష్ జో ఆంటోనీ మరో ప్రధాన పాత్రధారి. ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది.
జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించాడు. అయితే ఆయన లుక్ సీరియస్గా ఉంది. దీంతో కథను సగటు మలయాళ సినిమా సినిమాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అని అర్థమవుతోంది. మరి ఆ కథేంటో తెలియాలంటే ఓటీటీలోకి వచ్చేంతవరకు ఆగాలేమో. తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
విస్మయ గురించి చూస్తే.. ఆమె రచయిత, అసిస్టెంట్ డైరక్టర్ కూడా. ‘గ్రెయిన్ ఆఫ్ స్టార్ డస్ట్’ అనే పుస్తకం ఐదేళ్ల క్రితమే రాసింది. పదేళ్ల క్రితమే ‘గ్రహణం’ అనే షార్ట్ ఫిల్మ్ను తెరకెక్కించింది కూడా. లాలెటన్ నటించిన ‘పుంజురాణి’, ‘బరోజ్’ సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్గా చేసింది. ఒకానొక సమయంలో అధిక బరువుతో ఇబ్బందిపడ్డ విస్మయ ఛాలెంజింగ్గా తీసుకొని 22 కిలోల బరువు తగ్గింది. అదీ ఆమె పట్టుదల.