‘ఓజీ’ సినిమా విడులకు కొద్ది రోజుల ముందు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుండి ఓ స్పెషల్ వీడియో వచ్చింది. సినిమాలో పవన్ కల్యాణ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది అనేది ఆ వీడియో సారాంశం. ఆ తర్వాత సినిమా టీమ్ నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు. దానికి కారణం ప్రస్తుతం మార్కెట్లో ‘ఓజీ’ ఫీవర్ నడుస్తుండటమే. అయితే ‘ఓజీ’ ఓటీటీలోకి వచ్చే టైమ్ దగ్గరపడింది.. థియేటర్లలో సందడి కూడా తగ్గిపోయింది. దీంతో మరి ‘ఉస్తాద్..’ ఊపు ఎప్పుడు అనే ప్రశ్న మొదలైంది.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, సినిమా పరిశ్రమ వర్గాల్లో నడుస్తోంది. కనీసం సినిమా రాకపోయినా.. అప్డేట్ అయినా ఇవ్వండి అనేది అభిమానుల మాట. కానీ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పూర్తయింది పవన్ కల్యాణ్ పోర్షన్స్ మాత్రమే అని సమాచారం. మిగిలిన కాస్టింగ్ సీన్స్, పవన్ సజెషన్లో ఉన్న సీన్స్ ఇంకా తెరకెక్కించాల్సి ఉందట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ ఎలాగూ చేయాలి. కాబట్టి కొంతమంది ఆశిస్తున్నట్లు, ఊహిస్తున్నట్లు రెండు నెలల్లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదట.
ఇక సినిమా రిలీజ్కి అందుబాటులో ఉన్న డేట్స్ సంగతి చూస్తే.. సంక్రాంతికి ఖాళీ లేదు. కాబట్టి ఇక ఉన్న బెస్ట్ ఆప్షన్ వేసవే. కానీ అప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’, చిరంజీవి ‘విశ్వంభర’ ఉన్నాయి. ‘పెద్ది’ మార్చి 26కు తీసుకురావాలని చూస్తున్నారు. ‘విశ్వంభర’ మే రెండో వారంలో వస్తుందంటున్నారు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను అయితే ఏప్రిల్లో రిలీజ్ చేయాలి లేదంటే మే ఆఖరులో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి హరీశ్ శంకర్ ప్లానింగ్ ఎలా ఉంది అనేది తెలియాలి.
ఎందుకంటే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మంచి జోష్లో ఉన్నారు. ‘ఓజీ’ సినిమా ఇచ్చిన ఉత్సాహం అలా ఉంది. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో ఏ మాత్రం లోటు వచ్చినా తట్టుకోలేరు.