YVS Chowdary: అచ్చ తెలుగు సినిమా అంటున్నారు… ఎప్పుడంటే

ఆరేళ్ల క్రితం ‘రేయ్‌’తో ఆఖరిగా వచ్చారు దర్శకుడు వైవీఎస్‌ చౌదరి. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం అందుకోలేదు. అందుకో, లేక ఇంకెందుకో తెలియదు కానీ.. వైవీఎస్‌ చౌదరి మళ్లీ సినిమా తీయలేదు. అయితే పుట్టినరోజులప్పుడు, ఎన్టీఆర్‌ జయంతి సందర్భాల్లో తన గురించి, తన సినిమాల గురించి ప్రకటిస్తూ ఉంటారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా తన కెరీర్‌ గురించి, ఇండస్ట్రీ గురించి, తన తర్వాతి సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సినిమా ఎలా ఉంటుంది అనేది చెప్పుకొచ్చారు.

వైవీఎస్‌ చౌదరి ప్రేమకథలకు స్పెషలిస్ట్‌ చెప్పొచ్చు. ఎలాంటి నేపథ్యం ఉన్న కథ తీసినా, అందులో అందమైన ప్రేమకథను పొద్దికగా పెడతారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారట. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా.. తెలుగు వాళ్ల వాడి,వేడి ప్రతిబింబించేలా.. అందమైన ప్రేమకథ సిద్ధం చేశారట చౌదరి. ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించేలా సినిమాను సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్తవాళ్లతోనే ఈ సినిమా ఉండబోతోందట. గతేడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ రావడంతో ఆలస్యమైంది. పరిస్థితులు సర్దుకున్నాక మొదలుపెడతారట.

మరోవైపు ఓటీటీలవైపు వెళ్లాలని కూడా వైవీఎస్‌ చౌదరి అనుకుంటున్నారట. దీని కోసం ఒక టీమ్‌ను కూడా సిద్ధం చేసుకున్నాడట. బొమ్మరిల్లు బ్యానర్‌ ద్వారా అన్ని రకాల వేదికలపైనా కొత్త ప్రతిభను పరిచయం చేయాలని చూస్తున్నారట. కొత్త తరహా కంటెంట్‌ను చూపించాలనుకుంటున్నారట. గతంలోనూ వైవీఎస్‌ నిర్మాణ రంగం వైపు వచ్చిన విషయం తెలిసిందే. 2012లో రవితేజ హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘నిప్పు’ నిర్మించారు. ఆ సినిమా బోల్తా కొట్టింది. అదే సమయంలో ‘రేయ్‌’ కూడా అలానే అయ్యింది. ఇప్పుడైనా వైవీఎస్‌ పూర్వపు వైభవం తెచ్చుకోవాలని పుట్టిన రోజు నాడు ఆశిద్దాం!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus