సీనియర్ స్టార్ హీరోల్లో ఒక్కరితో సినిమా చేస్తే చాలు అని దర్శకులు అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఓ దర్శకుడు ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలతోనూ సినిమా చేసేశారు. ఇక నాలుగో హీరో మాత్రమే మిగిలారు అంటే ఎంత గొప్ప చెప్పండి. ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్లోనే ఉన్నారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో రానున్న సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వెంకటేశ్, బాలకృష్ణతో పని చేసిన ఆయన.. ఈ సినిమాతో మూడో సీనియర్ స్టార్ హీరోతో చేసినట్లు అవుతుంది.
ఆ లెక్కన ఇక లెక్కలో మిగిలింది నాగార్జున మాత్రమే. దీంతో ఇప్పుడు అనిల్ రావిపూడి ఆలోచనలు నాగార్జునవైపు వెళ్తున్నాయి అని సమాచారం. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా విడుదలయ్యాక కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్న అనిల్ రావిపూడి.. ఆ ప్రాజెక్ట్ నాగార్జునతోనే చేస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘నేను చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సినిమాలు చూస్తూ పెరిగాను’ అంటూ ఈ మధ్య చిన్న హింట్ కూడా ఇచ్చారాయన.
ఒకవేళ నాగార్జునతో సినిమా చేస్తే.. అది కచ్చితంగా తన స్టైల్ వినోదాత్మక సినిమాగానే ఉంటుంది. నాగార్జున నుండి పుల్ లెంగ్త్ కామెడీ సినిమా వచ్చి చాలా ఏళ్లు అయింది. ఆయనకు సరైన కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడి కలిస్తే ఎలా ఉంటుందో గతంలో చూశాం కూడా. ఆ లెక్కన అనిల్ రావిపూడి అలాంటి కథనే రెడీ చేస్తారని టాక్. మరి ఈ పుకార్లు నిజమై అనిల్ సీనియర్ స్టార్తో సినిమా చేస్తాడో, లేక యాక్షన్ టచ్ ఉన్న సినిమాను యంగ్స్టార్ హీరోతో చేస్తారా అనేది చూడాలి.
ప్రస్తుతానికి నాగార్జున్ తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రా. కార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఇటీవల అనౌన్స్ అయిందీ సినిమా.
