పాన్ ఇండియా సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లనే ఎందుకు పెడతారు? ఈ ప్రశ్నకు సింపుల్ సమాధానం హీరో సౌత్ కాబట్టి.. మరో ప్రధాన పాత్ర నార్త్ అయితే బ్యాలెన్స్ అయి ఉంటుందని. అయితే ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఇద్దరూ అక్కడి నుండే రావాలా? ఈ ప్రశ్నకు అయితే మనం సమాధానం చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి, ప్రశ్న వచ్చింది రాజమౌళి (S. S. Rajamouli) – మహేష్బాబు (Mahesh Babu) సినిమా విషయంలో. ఇప్పటికే ప్రియాంక చోప్రా (Priyanka Chopra) రూపంలో ఓ బాలీవుడ్ / హాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేసి రాజమౌళి..
ఇప్పుడు మరో హీరోయిన్గా బాలీవుడ్ నాయికనే తీసుకుందాం అనుకుంటున్నారట. #SSRMB అంటూ రాజమౌళి ఫ్యాన్స్, #SSMB29 అని మహేష్ బాబు ఫ్యాన్స్ పిలుచుకుంటున్న ఈ సినిమాలో రెండో కథానాయిక అవసరం కూడా ఉందట. సినిమా సెకండాఫ్లో ఆ పాత్ర ప్రవేశిస్తుందని సమాచారం. దీని కోసం ఓ హీరోయిన్ను ఎంపిక చేయాలని టీమ్ అనుకుంటోంది అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.
ఒక హీరోయిన్ను నార్త్ నుండి తీసుకున్నారు కదా, ఇప్పుడు సౌత్ భామను ఎంపిక చేస్తారు అని భావించారంతా. అయితే ఆ ప్లేస్కి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) అయితే బెటర్ అని అనుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు ఆమెతో టాక్స్ అయ్యాయని కూడా సమాచారం. కొత్త షెడ్యూల్లో ఆమె సినిమా టీమ్తో కలసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెబుతున్నారు కూడా. అయితే సినిమా టీమ్ నుండి ఎలాగూ అనౌన్స్మెంట్లు ఉండవు కాబట్టి..
ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్ట్లో కనిపిస్తేనో, లేక సినిమా టీమ్ ఎక్కడికైనా వెళ్తే అక్కడ కనిపిస్తేనో మనం ఫైనల్ చేసుకోవచ్చు. ఆ మధ్య హైదరాబాద్లో కొన్ని రోజులు, ఒడిశాలోని కొండ ప్రాంతాల్లో కొన్ని రోజులు సినిమా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత వరుస బ్రేక్లు వస్తున్నాయి. మామూలుగా అయితే తొలి షెడ్యూల్ తర్వాతనో, రెండో షెడ్యూల్ తర్వాతనో రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి సినిమా లైన్, కాన్సెప్ట్ చెబుతుంటారు. దానినే మనం అనౌన్స్మెంట్ అనుకునేవాళ్లం. కానీ ఈ సినిమా (SSMB 29) గురించి ఇంకా ఇలాంటి సమాచారం ఏమీ రాలేదు.