అంతా ఓకే.. ఈ రోజు రాత్రి ‘అఖండ 2: తాండవం’ సినిమా చూసేస్తాం అని బాలకృష్ణ ఫ్యాన్స్, రేపటి నుండి సినిమా చూసేయొచ్చు అని సగటు సినిమా ప్రేక్షకులు అనుకుంటున్న సమయంలో ఓ పిడుగు లాంటి వార్త ఒకటి బయటికొచ్చింది. అదే ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదలను కోర్టు నిలిపేసింది అని. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమైందా అని చూస్తే.. ఎప్పుడో పాత సినిమాల పంచాయితీ కారణంగా మద్రాసు హైకోర్టు ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదలను నిలిపేసిందట.
అసలేమైందంటే.. ‘అఖండ 2: తాండవం’ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ (అప్పట్లో 14 రీల్స్)తో కలసి గతంలో పని చేసిన బాలీవుడ్ నిర్మాణ, పంపిణీ సంస్థ ఎరోస్ రీసెంట్గా కోర్టు మెట్లు ఎక్కింది. మద్రాసు హైకోర్టులో ఈ మేరకు వాదనలు కూడా జరిగాయి. తమకు గతంలో ఈ నిర్మాణ సంస్థ రూ28 కోట్ల వరకు బాకీ పడింది అని.. ఆ డబ్బును ఇప్పించాలి అని ప్రస్తావించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమాను విడుదలపై ఇంజిక్షన్ ఆర్డర్ ఇచ్చింది.

అంటే, సినిమాను ఇప్పుడు విడుదల చేయడానికి వీల్లేదు. ఎరోస్ వ్యవహారం తేలేవరకు సినిమా విడుదల ఉండదు అని న్యాయస్థానం తన తీర్పులో వెలువరించింది. ఎరోస్, 14 రీల్స్ కలసి గతంలో ఓ స్టార్ హీరోతో వరుస సినిమాలు చేశాయి. అప్పట్లో లావాదేవీలు అయ్యాక పైన చెప్పిన రూ.28 కోట్లు పెండింగ్లో ఉండిపోయాయట. వాటిని వసూలు చేసుకోవడానికి ఇదే సమయం అని ఎరోస్ కోర్టుకు వెళ్లిందని అర్థమవుతోంది. ఈ మేరకు ఎరోస్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆంగ్ల మీడియా వార్తలు కూడా రాసింది.
దీంతో ఇప్పుడు అత్యవసరంగా సినిమా నిర్మాణ సంస్థ ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాల్సి ఉంది. బాకీ డబ్బుల విషయంపై ఓ నిర్ణయానికి రావాలి. లేదంటే సినిమా విడుదల జరగదు. సినిమాకు ఇంకా ఒక్క రోజే ఉన్న నేపథ్యంలో విషయం ఈ రోజు తేలిపోవచ్చు.
