మొన్నామధ్య దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీని పిలిచి ఒక రిస్ట్ వాచీ ఇచ్చినప్పుడు చిరంజీవి – బాబి కాంబినేషన్లో ఓ సినిమా ఓకే అయింది అనే మేటర్ మనకు అర్థమైపోయింది. అయితే నిర్మాత ఎవరు అనే విషయం తేలకపోవడంతో ఆ సినిమా ఇంకా అనౌన్స్ కాలేదు అని అప్పటి నుండి తెలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్లు ఉంది. మరో మూడు వారాల్లో ఈ సినిమా అనౌన్స్మెంట్ జరగబోతోంది. అవును.. ‘వాల్తేరు వీరయ్య’ కాంబో రిపీట్ ఇప్పుడు అఫీషియల్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఇటు ‘విశ్వంభర’ సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. మరోవైపు ‘మన శివశంకర్ ప్రసాద్’ / ‘రఫ్ఫాడించేద్దాం’ (రూమర్డ్ టైటిల్స్) కూడా ఆఖరి దశకు వచ్చేసింది అని సమాచారం. ఈ క్రమంలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేయడానికి ప్లాన్ చేసుకున్నారట. ఈ సుముహూర్తం సెప్టెంబరులో ఉండొచ్చు అని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కానీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి ‘పూనకాలు లోడింగ్’ అనే టైటిల్ పెడదాం అనుకుంటున్నారట.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అదే పేరు పక్కాగా ఉంటుందట. ఆ లెక్కన ఈ సినిమా పూర్తిగా మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ అంశాల మేళవింపుతో ఉంటుందని చెప్పొచ్చు. ‘వాల్తేరు వీరయ్య’తో వింటేజ్ చిరంజీవిని చూపించిన దర్శకుడు బాబీ.. ఇప్పుడు ఎలా చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అన్నట్లు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా యువ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని చేస్తారని సమాచారం. ఆయన స్వతహాగా చాయాగ్రాహకుడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమా కథాంశం దృష్ట్యా ఆయనైతే బాగుంటుంది అని టీమ్ అనుకుంటోందట. మరోవైపు కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలోనే ‘మిరాయ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.