చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర్వరప్రసాద్ గారు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘విశ్వంభర’ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని వచ్చే సమ్మర్లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా ఏంటీ అనేది కూడా నిర్ణయమైపోయింది. అదే బాబీ సినిమా. ‘వాల్తేరు వీరయ్య’ కాంబినేసన్ మళ్లీ రిపీట్ అవ్వనుండటంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దాని ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ బాబీ మరోవైపు క్యాస్టింగ్ పనులూ చూస్తున్నారట. అలా కాస్త ఓల్డ్ రాశీ ఖన్నాను సంప్రదించారట. ఆమె నుండి సానుకూల స్పందనే వచ్చింది అని చెబుతున్నారు. మరో హీరోయిన్గా బోల్డ్ భామ మాళవిక మోహనన్ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట.
కొన్ని రోజుల క్రితం ఆ సినిమా దర్శకుడు బాబీని చిరంజీవి తనింటికి పిలిచి స్పెషల్ వాచీ ఇచ్చారు. అప్పుడే మరో ప్రాజెక్ట్ ఓకే అయిందని తేలింది. కొన్ని రోజుల క్రితం ఆ సినిమాను ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోందని లీకులొచ్చాయి. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమా పోస్టర్ను రిలీజ్ చేసి అఫీషియల్గా చెప్పారు. ఆ పోస్టర్లో చిన్న హింట్ కనిపించింది. దాని ప్రకారం చూస్తే బెంగాల్ నేపథ్యంలో చిరంజీవి – బాబీ కొత్త సినిమా కథ ఉండబోతుంది.
సినిమా కాన్సెప్ట్ పోస్టర్లోని గొడ్డలి మీద ‘বংশে আসছে’ అని రాసి ఉంది. అది బంగ్లా భాష. ‘వంశంలోకి వస్తున్నాడు’ అని దాని అర్థం. అంటే సినిమాలో హీరో తన కుటుంబానికి దూరంగా ఉంటాడు. కీలకమైన సమయంలో తిరిగి తన వారి దగ్గరకు వస్తాడు. వచ్చాక ఏమైంది, ఆ ముందు ఏమైంది అనేది అనేదే సినిమా మెయిన్ లైన్ అని చెప్పొచ్చు.