CM Jagan, Balakrishna: ఒకే ఫ్రేమ్ లో జగన్, బాలయ్య.. నమస్కారం చేస్తూ?
November 16, 2022 / 03:53 PM IST
|Follow Us
ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించటానికి పద్మాలయ స్టూడియోస్ కు వచ్చారు. మహేష్, కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ వాళ్లను ఓదార్చడంతో పాటు ధైర్యం చెప్పారు. కృష్ణ కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించిన జగన్ అక్కడే ఉన్న బాలకృష్ణ, తలసాని శ్రీనివాసయాదవ్ లకు నమస్కారం చేశారు. జగన్ నమస్కారం చేయడంతో బాలయ్య కూడా జగన్ కు నమస్కారం చేశారు.
బాలయ్య జగన్ ఒకరినొకరు పలకరించుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ బాలయ్య రాజకీయంగా బద్ధ శత్రువులు అయినప్పటికీ జగన్ బాలయ్యకు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అఖండ సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్ల విషయంలో జగన్ చూసీచూడనట్లు వ్యవహరించారని కామెంట్లు వినిపించాయి. ఒకే ఫ్రేమ్ లో బాలయ్య, జగన్ కనిపించడంతో ఇద్దరినీ అభిమానించే వాళ్లు సంతోషిస్తున్నారు. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘానికి 20 సంవత్సరాల క్రితం జగన్ ప్రెసిడెంట్ గా ఉన్నారని కొన్ని పేపర్ క్లిప్స్ గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఆ పేపర్ క్లిప్స్ గురించి అటు జగన్ కానీ ఇటు బాలయ్య కానీ ఎప్పుడూ స్పందించలేదు. బాలయ్యకు కూడా జగన్ తనకు సినిమాల విషయంలో అభిమాని అనే సంగతి తెలుసు. మరోవైపు కృష్ణ పార్థివదేహాన్ని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు పద్మాలయ స్టూడియోస్ కు చేరుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది.
కృష్ణ మరణంతో ఆయనకు నివాళిగా సినిమాల షూటింగ్ లు బంద్ కావడంతో పాటు పలు జిల్లాల్లో థియేటర్లలో ఒక్క ఆట కూడా ప్రదర్శించలేదు. గతంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో నిర్మాతల మండలి ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. హరిహర వీరమల్లు షూటింగ్ కూడా నిన్న క్యాన్సల్ అయిందని సమాచారం.