‘గీత గోవిందం’ (Geetha Govindam) తో బ్లాక్ బస్టర్ కొట్టి టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు పరశురామ్(బుజ్జి)(Parasuram). ఆ సినిమా మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో వెంటనే మహేష్ బాబు (Mahesh Babu) పిలిచి మరీ ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. 2022 సమ్మర్ కి వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.
కానీ బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. దీంతో మళ్ళీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వంటి మిడ్ రేంజ్ హీరోతోనే సినిమా చేయాల్సి వచ్చింది. అదే ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గతేడాది సమ్మర్ కి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు పరశురామ్. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డకి (Siddu Jonnalagadda) ఒక కథ వినిపించాడు. దిల్ రాజు(Dil Raju) ఈ ప్రాజెక్టుని నిర్మించాలి అనుకున్నారు. కానీ ‘జాక్’ (Jack) దెబ్బకు ఆయన వెనకడుగు వేసినట్లు సమాచారం.
దీంతో ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసి.. వేరే హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు పరశురామ్.అతనికి ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసే మూడ్ కూడా లేదట. పాన్ ఇండియా కథలు, మాస్ కథలు చేయాలని ఉందట. కార్తీకి ఆల్రెడీ ఒక కథ వినిపించాడు. అది అతనికి బాగా నచ్చింది. ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ తో పక్కా మాస్ కథ ఇది.
తమిళ, తెలుగు భాషల్లో బై లింగ్యువల్ మూవీగా ఈ ప్రాజెక్టు చేయాల్సి ఉంది. కానీ కార్తీ ఇప్పుడు ఖాళీగా లేడు. ఓ పక్క ‘సర్దార్ 2’ చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక ‘ఖైదీ 2’ కూడా చేయాల్సి ఉంది. మధ్యలో నలాన్ కుమారస్వామితో ‘వా వాతియార్’ అనే సినిమా చేస్తున్నాడు. మరి పరశురామ్ కి ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో? ఆ ప్రాజెక్టుని ఏ బ్యానర్లో పరశురామ్ చేస్తాడో? తెలియాల్సి ఉంది.