Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్ వైరల్
- September 7, 2026 / 05:30 PM ISTByFilmy Focus Desk
మొన్నీ మధ్య వరకు పెద్దగా ఎవరూ పట్టించుకోని ఓ సినిమా గురించి ఇప్పుడు అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్.. ఇంకా చెప్పాలంటే దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘హనుమాన్ అంశ్’ గురించే ఇదంతా. రూ. రెండు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా తొలి వారం ఎలాంటి సౌండ్ చేయకపోయినా.. ఆ తర్వాత మౌత్ టాక్తో భారీ విజయం అందుకుంది. ఎంతగా అంటే రూ.100 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమైంది.
Vishal Chaturvedi
ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు విశాల్ చతుర్వేది చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొన్ని సినిమాలను ఓటీటీలు ఎలా చూస్తున్నాయి అనే విషయంలో గ్రౌండ్ రియాలిటీ చెప్పి చూపించారు. ఓటీటీ నిర్వాహకులు ‘హనుమాన్ అంశ్’ సినిమా కథను అవమానించి, తిరస్కరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక కథను వినిపించడానికి ఓ ఓటీటీ దగ్గరకు వెళ్లగా.. ‘హనుమాన్ అంశ్’ కథ చెప్పాల్సి వచ్చిందని.. ఆ తర్వాత చాలా బాధపడ్డానని చెప్పారు.

తానొక కథ చెప్పగా అంతర్జాతీయ స్థాయిలో కనెక్ట్ అయ్యే భారతీయ కథ ఏదైనా ఉందా అని ఓటీటీ వారు అడిగారట. అప్పుడు మహరాజ్ జీ (నీమ్ కరోలి బాబా) కథను వివరించారట. అయితే ఆ కథను తిరస్కరించిన తీరు, వాడిన భాష నచ్చలేదని చెప్పారాయన. ఓటీటీ వారి మాటలు విన్నాక ‘వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది’ అని అర్థమైందని విశాల్ చెప్పారు. ఎలాగైనా ఈ సినిమా బాగా తీయాలనే పట్టుదల అప్పుడు తనలో మొదలైంది అని విశాల్ చెప్పారు.
అంతేకాదు ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావొద్దని, ఓటీటీలో నేరుగా విడుదల చేయాలని కొంతమంది సలహా ఇచ్చారని.. కానీ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయకపోతే అసలు సక్సెస్ ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేమన్న ఉద్దేశంతో సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేశామని తెలిపారు. ఇక ఈ ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.10 లక్షలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఇప్పటివరకు రూ.99.13 కోట్లు కలెక్ట్ చేసింది.















