నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ జంటగా నటించిన ‘హీరో హీరోయిన్’ టీజర్ ను ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్. పైరసీ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ.. చాలా నష్టపోతుందని నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ…. ‘కిల్ పైరసీ’ అంటూ ఉద్యమాలు చేబడుతూ…. పైరసీ చేసే వాళ్ళని కూడా సినిమా ద్రోహులుగా చూస్తుంటారు. మొన్నటికి మొన్న అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా హైపర్ ఆది పైరసీ బిజినెస్ నడుపుతుంటాడు… చివర్లో హీరో హిత బోధ చేసి ఆ వ్యాపారాన్ని ఆపించేస్తాడు. ఆ వ్యాపారం చేయడం ద్రోహమే అన్నట్టు చూపిస్తారు. అలాంటిది ఈ చిత్రంలో మాత్రం `పైరసీ ద్రోహి`ని కూడా హీరోగా చేసేసారు.
ఈ చిత్రంలో హీరో కొత్త సినిమాల్ని పైరసీ చేస్తూ బిజినెస్ చేస్తుంటాడు. ఇక హీరోయిన్ ఓ నిర్మాత కూతురు. ఇక వీరిద్దరూ ప్రేమించుకోవడం… తరువాత తన తండ్రి తరుపున హీరోయిన్ నిలబడి.. హీరోతో గొడవ పెట్టుకోవడం… చివరికి ఏమైందనేది మిగిలిన కథ. `ఏ పైరెటెడ్ లవ్ స్టోరీ` అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ చిత్రాన్ని జి.ఎస్.కార్తీక్ డైరెక్ట్ చేసాడు. ఈ టీజర్ మొత్తం హీరో యాటిట్యూడ్, క్యారెక్టర్ చుట్టూ తిరిగేలా టీజర్ ని డిజైన్ చేసారు. ‘ప్రతీ మగాడూ ప్లే బాయే’, ‘ఛాన్స్ దొరికితే మేం కుక్కలమే’.. ‘తమిళ రాకర్స్ జిందాబాద్’ అంటూ సాగే డైలాగులు ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యాక కూడా జనాలు పైరసీ లోనే చూస్తారేమో మరి..!