కొన్నేళ్ల క్రితం టాలీవుడ్లో నిర్మాతలు రోజుల తరబడి సినిమా షూటింగ్లు ఆపి, మీటింగ్లు పెట్టి భారీ నిర్ణయాలు తీసుకున్నారు? అవి ఎంతవరకు పాటించారు, పాటిస్తున్నారు అనేది వేరే విషయం. అయితే ఆ సమయంలో మన హీరోలు చేయని పనిని.. ఇప్పుడు మాలీవుడ్ సినిమాల హీరోలు (Heroes) చేశారు. జూన్ 1 నుండి మలయాళ సినిమా పరిశ్రమలో బంద్ చేపట్టాలని అక్కడి నిర్మాతలు ఫిక్స్ అవ్వగా, స్టార్ హీరోలు ఇది సరికాదు అని గొంతెత్తారు.
కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తీసుకున్న బంద్ నిర్ణయానికి ఎంత మాత్రం మద్దతు ఇచ్చేది లేదని మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) తేల్చి చెప్పింది. దీంతో ఈ విషయం ఇప్పుడు వాడివేడిగా మారిపోయింది. నటీనటుల పారితోషికాలు, పన్ను విధానాలు భారంగా మారాయని, వీటికి పరిష్కారం తేలేంతవరకు షూటింగ్స్ ఆపేస్తామని కమిటీ తరఫున సురేష్ కుమార్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఆ మాటల్ని స్టార్ హీరోలు మమ్ముట్టి (Mammootty), మోహన్ లాల్తో (Mohanlal) పాటు ఇతర నటులు వ్యతిరేకిస్తున్నారు.
బంద్ నిర్ణయం వల్ల వేలాదిమంది కార్మికుల జీవనోపాధికి అడ్డు తగిలినట్టు అవుతుందని నటీనటుల సంఘం అంటోంది. కొంతమంది నిర్మాతల ప్రొడ్యూసర్ల స్వార్థం కారణంగా ఇదంతా జరుగుతోంది అని కూడా సంఘం చెబుతోంది. దీంతో ఇప్పుడు మాలీవుడ్ టాపిక్ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అలాగే మన దగ్గర బంద్ జరిగినప్పుడు హీరోలు (Heroes) ఇలా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
మలయాళ సినిమా ఇప్పుడెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని చూస్తే.. రీసెంట్ టైమ్స్లో వారి సినిమాలకు పేరొస్తున్నా డబ్బులు రావడం లేదు. ఒక్క జనవరిలోనే మలయాళ సినిమా పరిశ్రమకు రూ. 100 కోట్ల నష్టం వచ్చింది అని చెబుతున్నారు. 28 సినిమాలు వస్తే ఒక్క సినిమా ‘రేఖాచిత్రం’ మాత్రమే ఆడింది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు పరిశ్రమ బంద్ల వరకు వెళ్లింది. అయితే మన పరిశ్రమ తరహాలో వ్రతఫలం దక్కనట్లు ఉండకూడదు.