‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి చేసిన మమ్ముట్టి
- September 16, 2023 / 05:01 PM ISTByFilmy Focus
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈరోజు(సెప్టెంబర్ 16) పాలక్కాడ్ జిల్లా ఒట్టపాలెంలో ‘భ్రమయుగం’ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ఎంతో సంతోషంగా పంచుకుంది. ఆగస్టు 17, 2023న ‘భ్రమయుగం’ ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది. కొచ్చి మరియు ఒట్టపాలెంలో భారీ స్థాయిలో చిత్రీకరణ జరిగింది. మిగిలిన షెడ్యూల్ నటులు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ లతో కొనసాగుతుంది. చిత్రీకరణ అక్టోబర్ మధ్యలో పూర్తవుతుంది.
చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ‘భ్రమయుగం’ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్గా జోతిష్ శంకర్, ఎడిటర్గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టిడి రామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. మేకప్ బాధ్యతలు రోనెక్స్ జేవియర్, కాస్ట్యూమ్స్ బాధ్యతలు మెల్వీ జె నిర్వహిస్తున్నారు.
హర్రర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి ప్రత్యేకంగా స్థాపించిన నిర్మాణ సంస్థ నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్పై, రాహుల్ సదాశివన్ రచన-దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘భ్రమయుగం’ 2024 ప్రారంభంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.












