Jana Nayagan: ‘జన నాయగన్’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?
- February 1, 2026 / 09:25 PM ISTByFilmy Focus Desk
‘జన నాయగన్’ సినిమా పంచాయితీ ఇప్పుడు చెన్నై నుండి న్యూఢిల్లీకి చేరింది. హైకోర్టులో సినిమా గురించి పలు దఫాలుగా విచారణ సాగిన తర్వాత విషయం ఎటూ తేలకుండా తిరిగి మొదటికి వచ్చింది. మళ్లీ ఈ సినిమా విషయంలో విచారణలు జరిపి తీర్పు ఇవ్వండి సింగిల్ బెంచ్కి కేసు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా వివాదం ఎప్పటివరకు లాగుతారు అని అనుకుంటున్నారంతా. మరోవైపు ఈ విషయంలో సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. దీంతో విషయం మరింత ఆసక్తికరంగా మారింది.
Jana Nayagan
ఇటీవల రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ హీరో విజయ్ నటించిన చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా వివాదం మరోసారి సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఈ సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోండి అంటూ ఇటీవల సినిమా బృందం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు నిరాకరించింది. అయితే ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సినిమా నిర్మాత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారనే వార్తల నేపథ్యంలో సెన్సార్ బోర్డు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. ఏవైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు సెన్సార్ బోర్డు వాదన కూడా వినండి అని కేవియట్ పిటిషన్ ఉద్దేశం. మరి సుప్రీం ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ నెల 9న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ సెన్సార్ సమస్య కారణంగా వాయిదా పడింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు ఆ రోజే మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సెన్సార్ బోర్డు మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.
సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తొలుత న్యాయస్థానం తాత్కాలిక స్టే విధించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును నిర్మాణ సంస్థ ఆశ్రయించింది. సినిమా విడుదల విషయంలో జోక్యానికి అప్పుడు నిరాకరించిన సుప్రీం కోర్టు.. మద్రాసు డివిజన్ బెంచ్ని ఆశ్రయించాలని సూచించింది. సుదీర్ఘ వాదనల అనంతరం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సుప్రీంకి వెళ్తారని టాక్.













