సినిమా టికెట్ ధరల గురించి గత కొన్నేళ్లుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కొన్నాళ్లు మరీ తక్కువ ధర పెట్టారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత చిన్న సినిమాలకు కూడా అంత ఎక్కువ రేటు పెట్టేస్తే ఎలా అంటూ తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వివిధ పరిణామాల తెలంగాణలో టికెట్ పెంపు లేదు అని తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ప్రతి పెద్ద సినిమాకూ పెంచేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో సౌత్ రాష్ట్రం సినిమా టికెట్ ధరలపై క్యాపింగ్ విధించింది.
సినిమా టికెట్ ధరల విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్, సింగల్ స్క్రీన్ ఏదైనా సరే గరిష్టంగా టికెట్ రూ.200 లోపే ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు జీఓ జారీ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని కోరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ఫ్లెక్సీ ప్రైసింగ్ కాన్సెప్ట్ని వాడుకుని థియేటర్లు, బెంగళూరు నగరంలోని మల్టీప్లెక్సులు ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచేస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీని వల్ల నగరాల్లో సినిమా విడుదలైన తొలి రోజుల్లో ప్రేక్షకులు సినిమా అంటే భయపడే పరిస్థితి వచ్చింది. అందుకే గరిష్ఠ ధర ఆలోచనను ప్రభుత్వం చేసింది. దీంతో అందరికీ సినిమా అందుబాటులోకి వస్తుంది.
అయితే ఈ నిర్ణయం విషయంలో మల్టీప్లెక్సుల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. బెంగళూరులో ఉన్న ప్రీమియం మల్టీప్లెక్సుల్లో రూ.200 టికెట్ అంటే నిర్వహణ కష్టమవుతుంది. మరి ఈ విషయంలో కోర్టుకు వెళ్తే ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి. అయితే ఆ ప్రీమియమ్ మల్టీప్లెక్స్లు సినిమా రిలీజ్ అయినప్పుడు వీకెండ్ ఎండ్స్లో గరిష్ఠంగా రూ.1500 వరకు టికెట్ ధర పెడుతున్నాయి. ఈ విషయం కోర్టు దృష్టికి వెళ్తే ఏదో ఒక స్పష్టత వస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. కర్ణాటక ప్రభుత్వం ఆలోచన నుండి స్ఫూర్తి పొంది తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. అయితే మరీ మన దగ్గర రూ.1500 అయితే పెట్టడం లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి.