సినిమాలను రివ్యూయర్లను ఇబ్బంది పెడుతున్నారు, వారి వల్లే కొంతమంది థియేటర్లకు సినిమాలు చూడటానికి రావడం లేదు, అసలు రివ్యూయర్లకు ఏం తెలుసని, సినిమాలు తీయడం తెలుసా వారికి, ఒక సినిమా తీసి అప్పుడు మాట్లాడండి.. ఇలా గత కొన్నేళ్లుగా సినిమా రివ్యూయర్ల గురించి సినిమా పెద్దలు, సినిమా చిన్నలు అంటూనే ఉన్నారు. వీలైతే సినిమా రివ్యూలను నిషేధించాలని కొందరు పిలుపిచ్చారు. ఇంకొందరు అయితే ఓ వారం, పది రోజుల తర్వాత రివ్యూలు రాసుకోండి అని కూడా అన్నారు.
ఇప్పుడు వీరందరికీ మద్రాస్ హైకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. సినిమా రివ్యూలపై నిషేధం విధించడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించింది. రివ్యూలను బ్యాన్ చేయడం భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేసింది. సినిమా విడుదలైన మూడు రోజుల వరకూ రివ్యూలు ఎవరూ రాయకుండా నిషేధించాలని తమిళ సినిమా నిర్మాతల సంఘం కొన్ని రోజుల క్రితం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇటీవల మరోసారి విచారణకు వచ్చింది.
ప్రాథమిక వాదనలు విన్న జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఆ పిటిషన్ను కొట్టివేశారు. ఈ సోషల్ మీడియా యుగంలో సినిమా రివ్యూలు పోస్టు చేయకుండా ఆపడం అసాధ్యమని న్యాయస్థానం ఈ సందర్భంగా నిర్మాతల సంఘం తరఫున లాయర్లకు గుర్తు చేసింది. అయినా నిర్మాతలు పాజిటివ్ రివ్యూలే ఆశించలేరని స్పష్టం చేసింది. అయినా ప్రతి రంగంలోనూ సోషల్ మీడియా ట్రోల్స్ ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేసింది. దీంతో రివ్యూలు ఆపడం, ఆపాలనే వాదనలు ఇంక వినిపించే పరిస్థితి లేదు అని చెప్పుకోవాలి.
ఎక్కడో తమిళనాడులో జరిగితే.. టాలీవుడ్కి ఏంటి అనుకోవచ్చు. తీర్పు ఎక్కడైనా తీర్పే, ఎవరికైనా తీర్పే కదా. అసలేమైందంటే.. సూర్య (Suriya) హీరోగా నటించిన ‘కంగువా’ (Kanguva) సినిమా విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమా రివ్యూల మూడు రోజులపాటు బ్యాన్ చేయాలని నిర్మాతల సంఘం అప్పుడు కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు కోర్టు నిర్ణయంతో ఇక రివ్యూల బ్యాన్ చర్చ ఆగుతుందేమో చూడాలి.