రిలీజ్కి ముందు వరకు ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ప్రచారం భారీ స్థాయిలో నిర్వహించారు. టీమ్లో కొంతమంది దేశం మొత్తం తిరిగారు. ఇక్కడా అక్కడా అని లేకుండా వరుస ఈవెంట్లు పెట్టి ప్రచారం చేశారు. ప్రముఖ దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి, ఆ తర్వాత ప్రచారం కూడా చేశారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీస ప్రచారం కూడా లేదు. అయితే ఇండస్ట్రీ హిట్ అనే పోస్టర్ మాత్రం ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు వసూళ్ల లెక్క కూడా రావడం లేదు. కానీ సినిమా ప్రచారం సమయంలో పెద్దగా అలికిడి లేదని హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఇప్పుడు మాట్లాడింది.
‘కన్నప్ప’ సినిమా ప్రచారం సమయంలో ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ఎక్కడా కనిపించలేదు. ‘కన్నప్ప’ సినిమా టీమ్కి, ఆమెకు మధ్య గ్యాప్ ఏర్పడి ఉంటుందని చిన్నగా గుసగుసలు వచ్చాయి. దీని మీద టీమ్ నుండి కానీ, ఆమె కానీ స్పందించలేదు. అయితే ఇప్పుడు ప్రీతి సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్టు పెట్టింది. అయితే అందులో సినిమా టీమ్ నుండి ఎవరినీ ట్యాగ్ చేయలేదు. దీంతో ఏదో అయింది అనే చిన్న గుస గుస పెద్ద గుసగుస అయింది.
జీవితంలో కొన్నిసార్లు అనుభవాల్ని చెప్పడానికి మాటలు సరిపోవు. గత కొన్ని రోజులుగా నాకు అలాగే అనిపించింది. నా మీద ఇంత ప్రేమను కురిపించిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. మీ ప్రశంసలు నన్ను ఎంత సంతోషపరిచాయో మీకు తెలియదు. ఓ ఆరు నెలలు నేను ఆ పాత్రలో జీవించాను. ఆ పాత్ర కోసం చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. శారీరకంగా కష్టపడ్డాను. చిత్రీకరణలో నిద్రలేని రాత్రులెన్నో గడిపాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది అని ఆ పోస్టులో పేర్కొంది ప్రీతి ముకుందన్.
సెట్స్లో నటిగా రెండు వారాల అనుభవమే. అయితే భారత సినీ పరిశ్రమలోని ఎంతో మంది గొప్ప నటీనటులతో పని చేసే అవకాశం దక్కింది. వారందరినీ దగ్గర్నుండి చూసి ఎంతో నేర్చుకున్నాను. ఆ జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారందరికీ నేను కృతజ్ఞురాలిని అని కూడా రాసుకొచ్చింది. ఆమె ఏ సినిమా గురించి చెప్పింది అనే మాట ఎక్కడా ఆ పోస్టులో లేదు. అయితే షేర్ చేసిన వీడియో ‘కన్నప్ప’ సినిమాది.