సీనియర్ నటుడు.. ఇప్పుడు యాంగ్రీ హీరోగా మారిన రాజశేఖర్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నామధ్య ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అంటూ ఓ సినిమా చేసిన ఆయన.. ఇప్పుడు ఏక కాలంలో రెండు సినిమాలు చేయడానికి ఓకే చెప్పేశారు అని టాక్. అందులో ఓ సినిమాలో ప్రధాన పాత్రధారుడు కాగా.. రెండో సినిమాలో విలన్గా కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో, టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.
రాజశేఖర్ విలన్ అవుతారు అని చాలా ఏళ్లుగా వార్తలొస్తున్నాయి. జగపతిబాబు విలనీ చేయగానే రాజశేఖర్ పేరే నెక్స్ట్ వినిపించింది. ఆయన మాత్రం ఆ వైపు చూడలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ విలన్ అవ్వబోతున్నారట. విజయ్ హీరోగా రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్న ‘రౌడీ జనార్దన’ సినిమాలోనే రాజశేఖర్ ప్రతినాయకుడు అవుతారట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు నుండి ప్రారంభమవుతుందట. ఇప్పటికే ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట.
గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమాగా ఈ సినిమాను రవికిరణ్ కోలా రాసుకున్నారట. రాజకీయ అంశాలకు ప్రాధాన్యమున్న ఈ సినిమాలో విజయ్కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. ఆమె తండ్రిగా రాజశేఖర్ నటిస్తారు అని టాక్. ఇక మరోవైపు రీమేక్ కథ మీద రాజశేఖర్, జీవిత మనసు పడ్డారట. అదే తమిళంలో మంచి హిట్ కొట్టిన ‘లబ్బర్ పందు’. గ్రామీణ క్రికెట్ చుట్టూ తిరిగే ఈ సినిమా ఈగో చుట్టూ తిరుగుతుంది. ఒరిజినల్ కథలో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేస్తున్నారట.
ఈ సినిమాలో హీరోయిన్గా శివాని నటిస్తుంది అని సమాచారం. ఆమె వైపు నుండే ఈ సినిమా రాజశేఖర్ దగ్గరకు వచ్చిందట. అయితే ఈ రబ్బర్ బంతి క్రికెట్ సినిమా ‘లబ్బరు పందు’ ఓటీటీలో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇలాంటి సినిమాను ఇప్పుడు ఎంచుకోవడం అంత శ్రేయస్కరం కాదు అనేది రీసెంట్ టాలీవుడ్ రీమేక్లు చూస్తే తెలుస్తోంది. మరి జీవిత ఆలోచనలు ఏంటో?