పెద్ద పైరసీ ఫిష్ను పట్టేశారు.. ఇక టాలీవుడ్కి వచ్చిన కష్టం ఇంకేమీ లేదు. టాలీవుడ్ ఊపిరి పీల్చుకోవచ్చు అంటూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో గొప్పగా చెబుతున్నారు. కొంతమంది సినిమా పరిశ్రమ పెద్దలు అయితే టాలీవుడ్కి ఇది పునరుజ్జీవం లాంటిది అంటూ ఎలివేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ, ఇటీవల థియేటర్ సినిమాలు కూడా చేస్తున్న ఈటీవీ విన్ టీమ్ కీలక ప్రకటన చేసింది. ఆ బ్యానర్లో తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే సినిమా గురించి ఆసక్తికర ప్రకటన చేసింది.
ఐ బొమ్మ ఇమంది రవి పట్టుబడటంతో కొంతమంది నెటిజన్లు, సినిమా గోయర్స్ రియాక్ట్ అవుతూ.. థియేటర్లలో సినిమా టికెట్ రేట్లు, స్నాక్స్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా పైరసీ వైపు వెళ్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే మా సినిమా టికెట్ ధరను రూ.99కి తగ్గించింది. సింగిల్ థియేటర్లలో ఈ ధర ఉంటుంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.105 ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ ధరలు ఎక్కడా కనిపించడం లేదు.
హైదరాబాద్లోనే ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఆ ధరలు కనిపించడం లేదు. సినిమా విడుదలైన తొలి రెండు రోజులే ఈ ధరలు ఉన్నాయి. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల టికెట్లు నార్మల్ ధరలకు వచ్చేశాయి. గరిష్ఠంగా ఎంత టికెట్ రేటు పెట్టొచ్చు అనే పాత జీవోల ప్రకారం టికెట్ రేట్లు ఉన్నాయి. ఏమైందా అని ఆరా తీస్తే.. అలా తక్కువ ధరలు పెట్టడం వల్ల ఇతర సినిమాల వాళ్లకు సమస్యగా ఉందనే మాట రావడంతో.. చాలా చర్చల తర్వాత మల్టీప్లెక్స్లు, థియేటర్లలో పాత రేట్లు తెచ్చాయని సమాచారం.
ఓవైపు థియేటర్లకు వచ్చి సినిమా చూడండి అని కోరుకుంటూ.. మరోవైపు ఇలా టికెట్ రేట్లు తగ్గించొద్దు అనేలా మాట్లాడటం టాలీవుడ్కే చెల్లింది అనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాగే ఇందుకు కాదు టాలీవుడ్కి ఎవరూ మద్దతు ఇవ్వనిది అనే కామెంట్లూ కనిపిస్తున్నాయి.