ప్రముఖ కవి, రచయిత అందె శ్రీ (64) ఈ రోజు ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందెశ్రీ సినిమా పాటల రచయితగానే కాకుండా, తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రాశారు. ఆయన మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
అందె శ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. జులై 18, 1961న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా తన జీవనాన్ని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత రోజుల్లో భవన నిర్మాణ కార్మికుడిగానూ పనిచేశారు. అలా పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ‘మాయమైపోతున్నడమ్మా…’ అనే గీతంతో పేరు తెచ్చుకున్నారు. ఇక అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించి రూ.కోటి పురస్కారం కూడా అందించింది..

ఆశు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. ఆర్.నారాయణమూర్తి సినిమాల్లో పాటలు ఎక్కువగా రాసేవారు. 2006లో ‘గంగ’ సినిమాకుగాను నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ నుండి డాక్టరేట్ అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం రాగా.. రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా అదే ఏడాది అందుకున్నారు. వీటితోపాటు జానకమ్మ జాతీయ పురస్కారం ( 2022), దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం (2024) కూడా వచ్చాయి. లోక్నాయక్ పురస్కారాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు.

అందెశ్రీ ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
