‘లూసిఫర్’ సినిమా ముందు, తర్వాత అనేలా మలయాళ సినిమా మారింది. అదేంటి అంత పెద్ద మాట అనేశారు.. అలాంటి సినిమాలు మాలీవుడ్లో అప్పటివరకు రాలేదా? అనే ప్రశ్న మీరు వేయొచ్చు. అయితే ఇక్కడ ఉద్దేశం సినిమా స్థాయి, విజయం, వసూళ్లు కాదు. సినిమా కాంబినేషన్ గురించి. ఇద్దరు స్టార్ హీరోలు కలసి చేసిన సినిమా అది. అంటే ఇద్దరూ కలసి నటించారు అని కాదు. ఒకరు దర్శకుడు అయితే, మరొకరు హీరో.
అంతలా మాలీవుడ్ను మార్పు చేసిన సినిమా వెనుక ఓ విషాదం ఉందని తెలుసా? ఆ సినిమాకు సీక్వెల్గా రూపొందిన ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) వస్తున్న నేపథ్యంలో ‘లూసిఫర్’ గురించి ఓ న్యూస్ వైరల్గా మారింది. 2012లో రాజేష్ పిళ్లై అనే దర్శకుడు ‘లూసిఫర్’ పేరుతో ఒక కథ రాసుకుని మోహన్ లాల్కి (Mohanlal) వినిపించారు. రచయిత మురళి గోపితో (Murali Gopy) కలసి డెవలప్ చేశారు. టైటిల్ రిజిస్టర్ చేసి ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు.
రాజేష్ పిళ్లై అప్పటికే కుంచకో బోబన్తో ‘మోటార్ సైకిల్ డైరీస్’ సినిమా పనులు కూడా చూస్తుండుటంతో అటువైపు వెళ్లి బిజీ అయిపోయారు. ఆ సినిమా అయ్యాక ‘లూసిఫర్’ పనులు మొదలవుతుంది అని అనుకున్నారంతా. కానీ అనుకున్నది జరగలేదు. ఆ తర్వాత చాలా రోజులకు అంటే 2016లో రాజేష్ అనారోగ్యంతో చనిపోయారు. అలా ‘లూసిఫర్’ ప్రయాణం మొదటి గేరులోనే ఆగిపోయింది.
అయితే కొన్ని నెలల తర్వాత టైటిల్ తీసుకుని వేరే కథని తయారు చేశారు గోపి మురళి. అది కూడా మోహన్ లాల్కి నచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకుడిగా పరిచయం చేద్దామని ఫిక్స్ అయ్యారు. సినిమా పనుల కోసం కొచ్చిలో ఓ ఫ్లాట్ తీసుకొని పనులు చేయించి.. 2018లో ‘లూసిఫర్’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అలా మొదలైన సినిమా రూ.30 కోట్ల బడ్జెట్తో రూపొంది భారీ విజయం అందుకుంది. రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.